- బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజు…
- కలియుగ ఆరంభం ఖగోళ విశేషం..
- ప్రకృతి పరంగా వసంత ఆగమనం..
Ugadi Real Histor: తెలుగు వారు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే ఈ పండుగ మనకు కేవలం ఒక పండగ మాత్రమే కాదు, ఒక కొత్త ఆరంభం. 2026 మార్చి 19న మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి, శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అసలు ఉగాది అంటే ఏమిటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక ఉన్న అసలు కథలేంటి అనేది ఇప్పుడు నేటి జనరేషన్ పిల్లలకు అర్థమయ్యేలాగా తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం ఈ సకల చరాచర జగత్తును బ్రహ్మ దేవుడు సృష్టించడం ప్రారంభించిన రోజే ఉగాది. చైత్ర మాసే జగద్బ్రహ్మే ససర్జ ప్రథమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే చైత్ర మాసంలోని మొదటి రోజే ఈ సృష్టికి అంకురార్పణ జరిగింది. అందుకే దీనిని 'యుగాది' (యుగము + ఆది) అని పిలిచేవారు, కాలక్రమేణా అది 'ఉగాది'గా మారింది. అలాగే, సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలిస్తే, శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించిన శుభ సందర్భం కూడా ఇదేనని పండితులు చెబుతారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత, ఇదే రోజున కలియుగం ప్రారంభమైందని కూడా ప్రతీతి. అందుకే ఆధ్యాత్మికంగా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కేవలం పురాణాలే కాదు, మన పూర్వీకుల ఖగోళ శాస్త్రం కూడా ఉగాదిని ఒక శాస్త్రీయ దినంగా గుర్తించింది. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట లెక్కల ప్రకారం, ఈ రోజునే భూమిపై సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో ప్రసరించి కొత్త ఏడాదికి నాంది పలుకుతాయి. వరాహమిహిరుడు కూడా తన పంచాంగాన్ని ఇదే రోజున లోకానికి అంకితం ఇచ్చారు.
ప్రకృతి కూడా ఉగాదికి కొత్తగా చిగురుస్తుంది. ఆకురాలు కాలమైన శిశిర రుతువు ముగిసి, చిగురించే వసంత రుతువు ఈ రోజు నుంచే మొదలవుతుంది. చెట్లు కొత్త చిగుళ్లతో పచ్చదనాన్ని పంచుతుంటే, కోయిల కుహు కుహు రాగాలతో పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. వేప పువ్వు చేదు, మామిడి కాయ వగరు, చింతపండు పులుపు, బెల్లం తీపి ఇలా ఆరు రుచులతో కలిపిన ఉగాది పచ్చడి జీవితంలోని కష్టసుఖాల కలయికను మనకు గుర్తు చేస్తుంది. ఈ పచ్చడి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, రాబోయే ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని ఇస్తుంది.
ఉగాది రోజు సాయంత్రం అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. కొత్త సంవత్సరంలో తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆదాయం ఎంత? వ్యయం ఎంత? రాజపూజ్యం, అవమానం వంటి విషయాలను తెలుసుకుంటారు. గ్రహ స్థితులను బట్టి శాంతి పూజలు చేసుకోవడం మన సంప్రదాయం. ఉగాది అనేది ఒక కొత్త ఆశకు, కొత్త ఆలోచనకు పునాది వంటిది. అందుకే ప్రతి తెలుగు వారు ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.