Peddi cinema Update: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ‘పెద్ది’ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ సమయంలో రామ్ చరణ్కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని మేకర్స్ స్పష్టం చేశారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఎడమ కంటిపై చిన్న గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్, ఆయనకు దగ్గర్లోని ఆసుపత్రిలో చిన్నపాటి చికిత్స చేయించారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఇప్పటికే కోలుకున్నారని సమాచారం.
ఈ విషయంపై స్పందిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "రామ్ చరణ్ గారి ఆరోగ్యానికి సంబంధించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. సెట్లో జరిగిన చిన్న ప్రమాదంలో ఆయన కంటికి స్వల్ప గాయమైంది. ఒక చిన్న ప్రొసీజర్ తర్వాత ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. రేపటి నుంచే ఆయన తిరిగి షూటింగ్లో పాల్గొంటారు. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవు అని పేర్కొన్నారు.
మరోవైపు, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. కంటిపై బ్యాండేజీ ఉన్నప్పటికీ, చరణ్ చిరునవ్వుతో వారందరినీ పలకరించారు. ఫ్యాన్స్తో కలిసి సెల్ఫీలు దిగుతూ, తన ఆరోగ్యం గురించి ఎవరూ కంగారు పడొద్దని వారికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'పెద్ది' సినిమా విషయానికి వస్తే, ఇది ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్కుమార్, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.