Inspiring Director Stories: సినిమా రంగంలో వంద సినిమాలు తీసిన దర్శకులకు కూడా దక్కనంత పేరు, బాక్సాఫీస్ రికార్డులు కేవలం మూడు సినిమాలతోనే సొంతం చేసుకున్నాడు ఆ యువ దర్శకుడు. ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆయన పేరే మారుమోగుతోంది. ఆయనే 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'దురందర్' పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే 'నీకు ఛాన్స్ లేదు పో' అని గెంటేసిన వాళ్లే, ఈరోజు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే అది ఆదిత్య ధర్ పట్టుదలకు నిదర్శనం.
1983లో ఢిల్లీలోని ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆదిత్యకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కళ్ల నిండా కలలతో 2006లో ముంబైలో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బతకడం కోసం రేడియో జాకీగా పనిచేస్తూనే, అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాల కోసం తిరిగేవాడు. చివరకు విధు వినోద్ చోప్రా, విశాల్ భరద్వాజ్ వంటి దిగ్గజాల దగ్గర మెలుకువలు నేర్చుకున్నాడు. అప్పట్లో తక్కువ జీతంతో సరిపెట్టుకుంటూ, అదనపు ఆదాయం కోసం సినిమాలకు పాటలు, డైలాగులు కూడా రాసేవాడు. ఎంత రాసినా ఆయన లక్ష్యం మాత్రం ఎప్పుడూ మెగాఫోన్ పట్టుకోవడమే.
ఆదిత్య దర్శకుడిగా మారే క్రమంలో ఎదుర్కొన్న దెబ్బలుఎవరినైనా కుంగదీస్తాయి . 2016లో కత్రినా కైఫ్, ఫవాద్ ఖాన్ తో 'రాత్ బాకీ' అనే సినిమా మొదలుపెట్టాడు. కానీ సరిగ్గా షూటింగ్ సమయానికి ఉరి ఉగ్రదాడి జరగడం, పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడంతో ఆ సినిమా ఆగిపోయింది. అందరూ ఆయన్ని 'ఐరన్ లెగ్' అని ఎగతాళి చేశారు. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన ఒకే ఒక్క మాట— "దేవుడు నీకోసం ఏదో పెద్ద విజయాన్ని రాసిపెట్టాడు"— ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అదే సమయంలో జరిగిన భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సినిమా కోసం ఆదిత్య పడ్డ కష్టం అసాధారణం. ఏకంగా 50 మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను రహస్యంగా కలిసి సమాచారం సేకరించాడు. నిర్మాత అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్ను పెడదామన్నా, ఆదిత్య మాత్రం 10 కోట్ల మార్కెట్ ఉన్న విక్కీ కౌశల్ వైపు నిలబడ్డాడు. "నాకు స్టార్ డమ్ వద్దు, పాత్ర కోసం రక్తం ధారపోసే డెడికేషన్ కావాలి" అని పట్టుబట్టి 'ఉరి' తీశాడు. ఫలితం... దేశవ్యాప్తంగా 'హౌ ఈజ్ ద జోష్' అనే నినాదం మార్మోగింది. వందల కోట్ల వసూళ్లతో పాటు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితంలోనూ ఆదిత్య ఎంతో హుందాగా ఉంటారు. 'ఉరి' సినిమా సమయంలో పరిచయమైన నటి యామీ గౌతమ్ను 2021లో పెళ్లాడారు. తెలుగు ప్రేక్షకులకు 'గౌరవం', 'యుద్ధం' వంటి సినిమాలతో సుపరిచితురాలైన యామీ, పెళ్లి తర్వాత కూడా 'దురందర్' వంటి సినిమాలతో తన సత్తా చాటుతోంది. అవకాశాల కోసం వీధుల్లో తిరిగిన ఒక సామాన్య యువకుడు, ఈరోజు ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని ఆదిత్య ధర్ మరోసారి నిరూపించారు.