భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 2025 సంవత్సరం కంపెనీకి మైలురాయిగా నిలిచింది. తొలిసారిగా ఒకే సంవత్సరంలో 6 లక్షలకు పైగా కార్లను విక్రయించి, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న టాటా మోటార్స్ను వెనక్కి నెట్టి, మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని మహీంద్రా దక్కించుకోవడం విశేషం. హ్యుందాయ్ నాలుగో స్థానంలో నిలిచింది.
2025లో మహీంద్రా మొత్తం 6,25,603 ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 97 వేల యూనిట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సంఖ్యలు భారత మార్కెట్లో మహీంద్రాపై వినియోగదారుల విశ్వాసం ఎంతగా పెరిగిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ నెల మహీంద్రాకు స్పెషల్గా మారింది. ఒక్క నెలలోనే 71,624 వాహనాలను విక్రయించి ఆల్టైమ్ మంత్లీ సేల్స్ రికార్డును నమోదు చేసింది.
ఈ ఘన విజయంలో మహీంద్రా ఎస్యూవీ లైనప్ కీలక పాత్ర పోషించింది. స్కార్పియో (N & క్లాసిక్) మోడళ్లు కంపెనీకి నెంబర్ వన్ కార్లుగా నిలిచాయి. జనవరి నుంచి నవంబర్ వరకు ఈ మోడళ్లే 1.61 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న థార్ (3-డోర్ థార్ రాక్స్) అమ్మకాలు ఏకంగా 55 శాతం పెరిగాయి. అలాగే XUV 3XO, బొలెరో మోడళ్లు ఫ్యామిలీ కస్టమర్లతో పాటు గ్రామీణ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ను సొంతం చేసుకున్నాయి.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా మహీంద్రా దూకుడు చూపించింది. BE 6, XEV 9e వంటి ఎలక్ట్రిక్ SUVలు కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ మంచి స్పందన లభించింది. కేవలం 11 నెలల్లోనే ఈ రెండు మోడళ్లకు కలిపి 38,841 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం మహీంద్రా అమ్మకాలలో ఎలక్ట్రిక్ కార్లు 7 శాతం వాటా సాధించడం గమనార్హం. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని మహీంద్రా మరోసారి నిరూపించిందని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు.