ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు తాజాగా పెద్ద సవాల్ ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ను ‘హై-రిస్క్’ దేశాల జాబితాలోకి చేర్చుతూ అసెస్మెంట్ లెవల్–3 (AL3) కేటగిరీకి మార్చింది. ఇప్పటివరకు AL2లో ఉన్న భారత్ను ఇప్పుడు పాకిస్థాన్ వంటి అధిక రిస్క్ దేశాలతో సమానంగా పరిగణించడం గమనార్హం. ఈ కొత్త నిబంధనలు 2026 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేరళలో బయటపడిన ఈ స్కామ్లో, సుమారు 22 యూనివర్సిటీల పేరుతో దాదాపు 10 లక్షల మందికి నకిలీ విద్యార్హత పత్రాలు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ వ్యవహారం ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది.
ఆస్ట్రేలియా సెనేటర్ మాల్కం రాబర్ట్స్ కూడా ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో వేలాది మంది విద్యార్థులు కొనుగోలు చేసిన డిగ్రీలతో చదువుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ‘ఇంటిగ్రిటీ’ సమస్యలు పెరగడంతో విద్యార్థి వీసాల ప్రక్రియలో కఠినమైన తనిఖీలు అవసరమని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై కేవలం పత్రాలు సమర్పించడం సరిపోదు. విద్యార్థులు ఇచ్చే బ్యాంక్ స్టేట్మెంట్లను నేరుగా సంబంధిత బ్యాంకులను సంప్రదించి ధ్రువీకరిస్తారు. అలాగే, గతంలో చదివిన విద్యాసంస్థలకు ఫోన్ చేసి మార్కుల జాబితాలు, సర్టిఫికెట్లను క్రాస్ చెక్ చేస్తారు. ఇంగ్లిష్ భాషా నైపుణ్యానికి సంబంధించిన ఆధారాలను కూడా మరింత కఠినంగా పరిశీలించనున్నారు.
ఈ మార్పులు కేవలం భారత్కే పరిమితం కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దక్షిణాసియా దేశాలకూ వర్తిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న 6.5 లక్షల విదేశీ విద్యార్థుల్లో భారతీయులే సుమారు 1.4 లక్షల మంది ఉండటం గమనార్హం. అమెరికా, బ్రిటన్, కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియానే ఇప్పటికీ మెరుగైన విద్యా గమ్యమని విద్యాశాఖ మంత్రి జూలియన్ హిల్ పేర్కొన్నారు. అయితే ఈ కఠిన నిబంధనలు తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా అన్నది భవిష్యత్తులో తేలనుంది.