ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గించే ఔషధంగా సంచలనం సృష్టించిన 'ఒజెంపిక్' (Ozempic) ఇంజెక్షన్ ఇప్పుడు భారత్లోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా సంస్థ నోవో నార్డిస్క్ ఈరోజు ఈ ఔషధాన్ని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.
టైప్ 2 మధుమేహం నియంత్రణ కోసం అధికారికంగా అనుమతి పొందిన ఈ డ్రగ్కు, బరువు తగ్గించే గుణం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. దీని నెల రోజుల డోసు ప్రారంభ ధర రూ. 8,800గా ఉంది.
ఒజెంపిక్ (సెమాగ్లుటైడ్) అనేది వారానికి ఒకసారి తీసుకునే ఇంజెక్షన్. ఇది 0.25mg, 0.5mg, 1mg డోసుల్లో లభిస్తుంది. నొప్పి లేకుండా సులభంగా ఇంజెక్ట్ చేసుకునేందుకు వీలుగా 'నోవోఫైన్ నీడిల్స్' అనే ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో దీన్ని అందిస్తున్నారు. ప్రారంభ డోస్ అయిన 0.25mg పెన్ ధర రూ. 8,800 కాగా, 0.5mg ధర రూ. 10,170, 1mg ధర రూ. 11,175గా కంపెనీ నిర్ణయించింది. ప్రతి పెన్లో నాలుగు వారాలకు సరిపడా డోసులు ఉంటాయి.
ఈ సందర్భంగా నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా మాట్లాడుతూ... "ఒజెంపిక్ను భారత్కు తీసుకురావడం ఒక ముఖ్యమైన మైలురాయి.
ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన క్లినికల్ ఫలితాలతో వస్తున్న ఈ ఔషధం భారతీయ వైద్యులకు ఒక సమర్థవంతమైన చికిత్సా మార్గాన్ని అందిస్తుంది. సులభంగా వాడే పెన్ ద్వారా మెరుగైన గ్లూకోజ్ నియంత్రణ, బరువు నియంత్రణ, గుండె, కిడ్నీలకు దీర్ఘకాలిక రక్షణ అందించడమే మా లక్ష్యం" అని వివరించారు