ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువతేజంగా, విద్యా మరియు ఐటీ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేశ్ నేడు (జనవరి 23) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు (దావోస్) ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి స్వదేశానికి చేరుకుంటున్నారు. లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని అటు కుటుంబ సభ్యులు, ఇటు రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి.
"మీ పక్కన నడవడం గర్వంగా ఉంది": నారా బ్రాహ్మణి ఎమోషనల్ సందేశం
లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పెట్టిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "బాధ్యతతో పాటు సుదీర్ఘంగా పని చేసుకుని వెళ్తున్నారు.. మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము నిశబ్దంగా చూస్తున్నాం" అంటూ లోకేశ్ పనితీరును ఆమె ప్రశంసించారు. మార్పు తీసుకురావాలనే ఆయన నిబద్ధత అందరికీ స్ఫూర్తినిస్తుందని, ఆయన పక్కన నడవడం తనకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ఆయనకు ప్రశాంతంగా సాగిపోవాలని ఆమె ఆకాంక్షించారు.
"విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు": డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
‘రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేశ్ ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.
మంత్రులు మరియు నేతల ప్రశంసలు…
హోంమంత్రి వంగలపూడి అనిత: మంత్రి నారా లోకేశ్కు హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ‘ముస్తాబు’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నారా లోకేశ్ ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.
ఎంపీ కేశినేని శివనాథ్: మంత్రి లోకేశ్కు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్కు బలమైన పునాదులు వేస్తున్న యువ నాయకుడు నారా లోకేశ్ అని అన్నారు. మంత్రి లోకేశ్తోనే విద్యా వ్యవస్థలో సాధ్యమైన విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి రథసారథిగా అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రతిక్షణం శ్రమిస్తున్న ప్రజాసేవకుడు లోకేశ్ అని కొనియాడారు. రాష్ట్రంలోని యువతకు అత్యున్న ఉపాధి అవకాశాలు అందించాలని ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్న యువతేజం లోకేశ్ అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్: మంత్రి లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) శుభాకాంక్షలు తెలిపారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేశ్కు జన్మదిన శుభాకాంక్షలని అన్నారు. తాత వారసత్వాన్ని, తండ్రి విజనరీని పుణికిపుచ్చుకున్న నేత లోకేశ్ అని తెలిపారు. రాష్ట్రంలోని యువత స్వప్నాల సాధకుడు నారా లోకేశ్ అని పేర్కొన్నారు. తన శాఖలైన విద్య, ఐటీ రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నారని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకొస్తున్నారని.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిస్పృహలోకి వెళ్లిన యువతకు లోకేశ్ ఆశాజ్యోతిగా నిలిచారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.