వినియోగంలో లేని రాజీవ్ గృహకల్ప ఇళ్లపై సమీక్ష కోరిన పల్లా..
గంగవరం నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలి: పల్లా..
విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో ప్రస్తావించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిడ్కో, రాజీవ్ గృహకల్ప పథకాల కింద కేటాయించిన అనేక ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా ఉండటంపై పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల రెండు దశాబ్దాల క్రితమే ఇళ్ల కేటాయింపులు జరిగినప్పటికీ, లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండకపోవడంతో ఆ ప్రాంతాల్లో సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఖాళీ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, దీని వల్ల సమీప ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
దీంతో, చాలాకాలంగా వినియోగంలో లేని ఇళ్లపై సమగ్ర సమీక్ష నిర్వహించి, నిజంగా అవసరమైన పేద కుటుంబాలకు మళ్లీ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గతంలో కూడా ఈ సమస్యను పలుమార్లు ప్రస్తావించినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదని ఆయన అన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
గాజువాక నియోజకవర్గంలో కొత్తగా అర్హత సాధించిన వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు కావడంలో ఆలస్యం జరుగుతోందని కూడా పల్లా శ్రీనివాసరావు ప్రస్తావించారు. అర్హులైన వారికి సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు త్వరగా అందేలా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, సంబంధిత అధికారులను కోరారు.
అలాగే గంగవరం పోర్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన గంగవరం, దిబ్బపాలెం గ్రామాల కుటుంబాల సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించారు. వారికి ఇవ్వాల్సిన జీవన భృతి, ఇతర ఆర్థిక సహాయాలు ఇప్పటికీ పూర్తిగా అందలేదని తెలిపారు. ముఖ్యంగా అర్హులైన కుటుంబాలకు ప్రకటించిన రూ.1 లక్షల జీవన భృతి వెంటనే విడుదల చేసి, పెండింగ్లో ఉన్న పునరావాస హామీలను త్వరగా అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ అంశంపైనా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, పెండింగ్ కేసులను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వేదికను వినియోగిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం కొనసాగిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజల అవసరాలకు తక్షణ స్పందన ఇవ్వడం, బలహీన వర్గాలకు న్యాయం చేయడం ద్వారానే మంచి పరిపాలనకు అర్థం వస్తుందని ఆయన పేర్కొన్నారు.