ప్రజాస్వామ్యంలో గొడ్డలి రాజకీయాలకు స్థానం లేదు : చంద్రబాబు..
వైఎస్ కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి : చంద్రబాబు..
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్వహించిన చిట్చాట్లో వైసీపీ, జగన్ కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు “సైకో” కంటే “గొడ్డలి పార్టీ” అనే అంశాన్ని బలంగా గుర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఈ అంశం మరింతగా చర్చకు వస్తుండటంతో జగన్లో అసహనం, ఫ్రస్టేషన్ పెరుగుతోందని అన్నారు.
వైఎస్ కుటుంబానికి సంబంధించిన అనేక అరాచకాలు తనకు కూడా పూర్తిగా తెలియవని, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం కడప జిల్లాలో ప్రచురితమైన “పాలెగాళ్ల రాజ్యం” అనే పుస్తకాన్ని ఇప్పుడు ప్రజలు మళ్లీ చదువుతున్నారని చెప్పారు. ఆ పుస్తకంలో అప్పట్లోనే కొన్ని వాస్తవాలు బయటపెట్టారని గుర్తుచేశారు.
ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు స్థానం లేదని సీఎం స్పష్టం చేశారు. “నక్సలైట్లు గన్తో రాజ్యాధికారాన్ని సాధించలేరు… అలాగే గొడ్డలితో రాజకీయాలు చేయలేరు” అంటూ వ్యాఖ్యానించారు. అందుకే వైసీపీ ప్రజాస్వామ్యానికి పనికిరాని పార్టీగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కేసులో సునీత చేస్తున్న పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు సునీతకు ఉంది కదా” అని ప్రశ్నించారు. సునీత పోరాటం వల్లే వివేకా హత్య కేసు ఇప్పటికీ సజీవంగా ఉందని పేర్కొన్నారు.
హత్యా రాజకీయాలు చేసినవారు రాష్ట్రాన్ని పాలించవచ్చా? కానీ బాధితులు జిల్లా రాజకీయాలు కూడా చేయకూడదా? అని సీఎం ప్రశ్నించారు. ఇప్పటి యువతకు కూడా వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాల గురించి అర్థమవుతోందని, జగన్ కుటుంబ చరిత్ర ఇప్పుడు ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.