Minister Nimmala: కర్నూలు కలెక్టరేట్లో నిర్వహించిన బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ పాల్గొని ప్రభుత్వ లక్ష్యాలను, గత పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులకు తోడు, గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందని విమర్శించారు. 2024 నాటికి వెంటిలేటర్పై ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో, ప్రధాని మోదీ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో మళ్లీ గాడిలో పెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. విభజన సమయంలో 58 శాతం జనాభా ఉన్న ఏపీకి కేవలం 46 శాతం వనరులే దక్కినప్పటికీ, ప్రకృతి విపత్తులను తట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన కొనియాడారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు భారీగా వడ్డీలు చెల్లిస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి వివరించారు. వైసీపీ హయాంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, నేడు ఒకటో తారీఖునే జీతాలు, పెన్షన్లు అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ యువతను మోసం చేసిన జగన్ మెగా డీఎస్సీని విస్మరించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 15,941 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో 'అమ్మ ఒడి' పేరుతో ఇంట్లో ఒక్కరికే పరిమితమైన పథకాన్ని మార్చి, 'తల్లికి వందనం' ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధాని విషయంలో గతంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్మిస్తున్నామని, అలాగే విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి 2027 నాటికి పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని మంత్రి వెల్లడించారు. జగన్ పాలన చూసి పారిపోయిన పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి మళ్లీ రాష్ట్రానికి రప్పిస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల ఆధునీకరణ పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తామని, శ్రీశైలం ప్లంజ్ పూల్ మరమ్మతులకు నిధులు కేటాయించి రక్షణ చర్యలు చేపట్టామని వివరించారు.
రాయలసీమలోని చెరువులు నేడు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయని, గతంలో హంద్రీ-నీవా మోటార్లకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి నుంచి ఏడాదిలోనే పనులు పూర్తి చేసి 730 కిలోమీటర్ల దూరంలోని కుప్పంకు నీళ్లు తీసుకెళ్లామని నిమ్మల రామానాయుడు గర్వంగా ప్రకటించారు. 2014-19 మధ్య చంద్రబాబు తెచ్చిన సంస్కరణలను జగన్ నాశనం చేశారని, మళ్లీ ఆయన వస్తే రాష్ట్రం కోలుకోలేదని హెచ్చరించారు. సంపదను సృష్టించడం, ఆ సంపదను ప్రజలకు పంచడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.