LPG Crisis India: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ఇంధన గండం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు చిన్న తరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ కమర్షియల్ ఎల్పీజీ (LPG) కోటాను భారీగా పెంచింది. గత మూడు వారాలుగా గ్యాస్ సిలిండర్ల కొరతతో అల్లాడుతున్న వ్యాపార రంగానికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.
పరిస్థితిని సమీక్షించిన కేంద్ర పెట్రోలియం శాఖ, రాష్ట్రాలకు అందే కమర్షియల్ గ్యాస్ కోటాను అదనంగా 20 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల హోటళ్లు, క్యాంటీన్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మునుపటిలాగే గ్యాస్ సరఫరా అందనుంది. ప్రస్తుత సరఫరా సంక్షోభానికి ముందున్న స్థాయిలో 50 శాతానికి చేరుకుందని అధికారులు వెల్లడించారు.
అయితే, ఈ అదనపు గ్యాస్ కోటా పొందాలనుకునే వ్యాపార సంస్థలకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. పెంచిన కోటాను కావాలనుకునే వారు తప్పనిసరిగా ఆయిల్ కంపెనీల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాకుండా, భవిష్యత్తులో ఎల్పీజీపై భారం తగ్గించడానికి వీలుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలంలో సిలిండర్ల వాడకాన్ని తగ్గించి, నేరుగా పైపుల ద్వారా గ్యాస్ సరఫరాను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశం.
సామాన్యులకు భయం వద్దు.. గృహ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగదు. ప్రస్తుతం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరగడం వల్ల సామాన్యుల సిలిండర్ల సరఫరా పక్కాగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొరత వస్తుందనే భయంతో ముందే బుక్ చేసుకునే 'పానిక్ బుకింగ్స్' చేయవద్దని, హోమ్ డెలివరీ సర్వీసులు ఎప్పటిలాగే సక్రమంగా జరుగుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మరోవైపు గ్యాస్ బ్లాక్ మార్కెట్పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 3,500 చోట్ల దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 1,400 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని తెలియజేయడంతో ఇంధన రంగం మళ్లీ గాడిలో పడుతోంది.