- ఆస్తి తగాదాలు.. ఆత్మీయుల దూరం: వైఎస్ కుటుంబ వివాదాలతో బలపడుతున్న పాత అనుమానాలు..
- Politics: నాడు కాంగ్రెస్పై.. నేడు సొంత రక్తానికే సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో జగన్?
Jagan: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఐతే, ఈ విషాద ఘటనను గత 15 ఏళ్లుగా వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వైఎస్ మరణం వెనుక కుట్ర ఉందంటూ నాటి కాంగ్రెస్ హైకమాండ్పై, ఆ తర్వాత టీడీపీపై ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పుడు ఆనాడు వైసీపీ వ్యక్తం చేసిన అనుమానాల బాణం..ఇప్పుడు తిరిగి జగన్ మోహన్ రెడ్డి వైపు మళ్లుతుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
వైఎస్ మరణించిన సమయంలో కాంగ్రెస్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సహా మరికొంతమంది గతంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణం వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరనే కోణంలో విచారణ జరపాలంటూ నాటి కాంగ్రెస్ నేతలు పరోక్షంగా జగన్ను టార్గెట్ చేశారు. తాజాగా రాజకీయ సమీకరణాలు మారిన వేళ, ఆ పాత ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, సొంత పార్టీ ఏర్పాటు, అధికారంలోకి రావడం.. ఇవన్నీ చూస్తుంటే నాటి విమర్శల్లోని అంతరార్థం ఇప్పుడు జనాల్లో చర్చకు దారితీస్తోంది.
వైఎస్ కుటుంబంలో నెలకొన్న ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. వైఎస్ షర్మిల, విజయమ్మ జగన్కు దూరం కావడం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత తమ్ముడిపైనే ఆరోపణలు రావడం చూస్తే.. వైఎస్ మరణం విషయంలోనూ నాడు వినిపించిన 'ఇన్సైడర్' కుట్ర కోణం నిజమేనా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. రాజకీయం కోసం తండ్రి మరణాన్ని వాడుకున్నారా..? లేక నిజంగానే దాని వెనుక ఎవరికీ తెలియని రహస్యాలు ఉన్నాయా..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
జగన్ తన ప్రసంగాల్లో తరచుగా దేవుడి స్క్రిప్ట్ అనే పదం వాడుతుంటారు. ప్రత్యర్థులకు చెడు జరిగితే అది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని జగన్ చెప్పేవారు. అయితే, ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయి జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాడు తండ్రి మరణంపై ఇతరులను వేలెత్తి చూపిన జగన్, ఇప్పుడు అదే అంశంపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వడం నిజంగా దేవుడి స్క్రిప్టే.