99 రోజుల పాటు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక
విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ఫోకస్
సాంకేతికతతో ఇంటి వద్దకే సేవలు
తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు అనేది ఒక పండుగలా కాకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతర ప్రక్రియ'గా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. అంటే, ఇకపై రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు.
రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లేందుకు 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం మార్చి 6వ తేదీన ప్రారంభమై, జూన్ 12 వరకు.. అంటే దాదాపు 99 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఈ 99 రోజుల ప్రణాళికను అత్యంత బాధ్యతగా అమలు చేయాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పరిపాలనలో భారీ మార్పులు తీసుకురావాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మెజారిటీ సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే పొందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందుతున్నాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా వంద మండలాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా పేదలకు నాణ్యమైన చికిత్స అందించాలని అధికారులను కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ప్రాధాన్యత ఇచ్చి, లబ్ధి చేకూర్చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.