చంద్రబాబు హయాంలోనే వృద్ధులకు అసలైన భరోసా…
భక్తుల మనోభావాలు గాయపర్చిన వైసీపీ సర్కార్…
పింఛన్ పెంపుపై జగన్ మోసం…
AP Politics: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శనివారం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో పర్యటించారు. 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను అందజేశారు. దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో భారీ మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి కొనియాడారు.
ప్రస్తుత ప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని మంత్రి వివరించారు. గతంలో ఉన్న పింఛన్ మొత్తాన్ని గణనీయంగా పెంచి, వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ. 15 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛన్ పెంపు విషయంలో వైఎస్ జగన్ మాట తప్పి వృద్ధులను మోసం చేశారని, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల పక్షాన నిలబడి ఆర్థిక భరోసా కల్పించారని మంత్రి విమర్శించారు. ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి డబ్బులు అందడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను మంత్రి తీవ్రంగా ఖండించారు. కేవలం కాసుల కక్కుర్తితో కోట్లాది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. భగవంతుడికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతేనే భక్తులు ఎంతో బాధపడతారని, అలాంటిది సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి నైవేద్యాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ నేతలు పారిపోతున్నారని, వారు సభ నుంచి తప్పించుకున్నా భగవంతుడి శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
వైఎస్ జగన్కు హిందూ ధర్మం పట్ల కనీస గౌరవం లేదని మంత్రి విమర్శించారు. కడప జిల్లాలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లినప్పుడు అక్కడ పూజారి ఇచ్చిన తీర్థాన్ని జగన్ తీసుకోకుండా కింద పడేశారని గుర్తుచేశారు. తీర్థం స్వీకరించడానికి ఇష్టపడని వ్యక్తి విగ్రహ ప్రతిష్టలకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. హిందూ ఆచారాలను పాటించని వారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేవాలయాలపై దాడులు, సంప్రదాయాల ఉల్లంఘన పరాకాష్టకు చేరిందని మంత్రి ఆరోపించారు.