ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో న్యాయవ్యవస్థకు సంబంధించి ఒక కీలక అడుగు పడింది. నగరంలో నూతన కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కోర్టు భవనాలకు పునాది రాయి వేయడం చాలా శుభసూచికమని కొనియాడారు. లోకనాయకుడు వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భక్తులు ఎలా వస్తారో, అదే విధంగా ఈ నూతన భవనం కూడా సామాన్య ప్రజలకు న్యాయం అందించే మరో ఆలయంలా మారుతుందని తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థ బలోపేతం గురించి మాట్లాడుతూ.. దేశంలో న్యాయవ్యవస్థ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వృత్తిలోకి వస్తున్న యువ న్యాయవాదులు చాలా చురుకుగా పనిచేస్తున్నారని, వారి ప్రతిభ వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని ప్రశంసించారు. న్యాయవాదులు కేవలం వాదనలు వినిపించడమే కాకుండా, బాధితులకు మేలు జరగాలనే ఉద్దేశంతో సరైన దిశలో ఆలోచించినప్పుడే కక్షిదారులకు నిజమైన న్యాయం అందుతుందని ఆయన సూచించారు. న్యాయవాది చేసే ఆలోచన మీదనే ఒక వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు.
ప్రజల నమ్మకం గురించి సీజేఐ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారు. మనిషికి ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, డాక్టర్ దగ్గరకు వెళ్తే కచ్చితంగా నయమవుతుందనే బలమైన నమ్మకంతో ఆసుపత్రికి వెళ్తారని, అక్కడ వైద్యులు ఇచ్చే భరోసానే సగం రోగాన్ని తగ్గిస్తుందని చెప్పారు. సరిగ్గా అదే విధంగా, కోర్టు మెట్లు ఎక్కే సామాన్యుడికి కూడా "న్యాయస్థానానికి వెళ్తున్నాను.. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది" అనే భరోసా కలగాలని ఆకాంక్షించారు. వ్యవస్థపై ప్రజల్లో ఉండే ఆ నమ్మకమే న్యాయవ్యవస్థకు అసలైన బలం అని ఆయన స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత కేవలం న్యాయమూర్తుల మీదనే కాకుండా, ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే న్యాయవాదుల నుంచి ఉన్నత అధికారుల వరకు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే సామాన్యుడికి న్యాయం చేరువవుతుందని చెప్పారు. ఈ కొత్త భవన సముదాయం అందుబాటులోకి వస్తే న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతిలో కోర్టు భవనాల నిర్మాణం వేగంగా పూర్తి కావాలని, ఇది భవిష్యత్తులో ఎంతోమందికి న్యాయం చేకూర్చే పవిత్ర వేదికగా నిలవాలని జస్టిస్ సూర్యకాంత్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నత న్యాయమూర్తులు, న్యాయవాదులు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నూతన భవనం ఆధునిక హంగులతో, సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్యులకు న్యాయ సేవలను సులభతరం చేయనుంది.