- వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటన బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం..
- మీ ఇంట్లో బిడ్డగా అండగా ఉంటామంటూ బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్..
Kandula Durgesh: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వారిని చూసి మంత్రి దుర్గేష్ చలించిపోయారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించిన ఎక్స్ గ్రేషియా చెక్కులను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జనసేన పార్టీ ఇంచార్జి మరియు డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబులతో కలిసి అందించారు. గాలిలో కలిసిన ప్రాణాలు, గుండె కోత మిగిల్చిన విషాదంతో ఆ కుటుంబాల కళ్లల్లో గూడుకట్టుకున్న శోకాన్ని చూసి మంత్రి కందుల దుర్గేష్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా ప్రమాదంలో మరణించిన సామర్లకోటకు చెందిన దర్శిపాటి నాని(38), ఏడిద సంపత్ కుమార్(25), జి.మేడపాడు గ్రామానికి చెందిన గంపల మంగ(43), గంపల నాగరాజు(45), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని(44), గొడత మహేష్(41), గొడత వీరవెంకట రమణ(48), కడింపల్లి ధనరాజు(55), పెదబ్రహ్మదేవం కి చెందిన మకర రాఘవమ్మ(55) ల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వారి గ్రామంలో సభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్న భరోసా కల్పించారు. వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసి ఓదార్చారు.
పోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెబుతూ వారి తరపున కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, మీ ఇంట్లో ఒక బిడ్డగా, మీ అన్నదమ్ముడిగా తానున్నాను.. తమ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని బరువెక్కిన గుండెతో మంత్రి కందుల దుర్గేష్ చెక్కులు పంపిణీ చేయడం పలువురిని కంటతడి పెట్టించింది.. కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లడం కాకుండా, ప్రతి ఇంటి లోపలికి వెళ్లి వారి కష్టసుఖాలను మంత్రి దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు.ప్రమాదానికి గల కారణాలను విచారించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
ఈ పర్యటనలో స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, కూటమి కార్యకర్తలు పాల్గొని బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.