- వైసీపీని పురాణ కాలంలో యజ్ఞాలను చెడగొట్టే రాక్షసులతో..
- 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని మంత్రి..
Nimmala Ramanaidu visited Palakollu: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఓ వృద్ధురాలికి పెన్షన్ అందజేసిన మంత్రి, ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తప్పించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనని విమర్శించారు.
శాసనమండలికి వాకౌట్' అన్నట్లుగా వైసీపీ వ్యవహారం ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. రోడ్డు మీదకు వస్తే రౌడీల్లా ప్రవర్తించే సంస్కృతి ఆ పార్టీదని మండిపడ్డారు. 2029లో తాము అధికారంలోకి వస్తే పొట్టేళ్లను నరికినట్లు నరికేస్తామంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాక్షసత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం మానవత్వంతో వృద్ధులు, దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తుంటే, మరోవైపు వైసీపీ మాత్రం విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వైసీపీని పురాణ కాలంలో యజ్ఞాలను చెడగొట్టే రాక్షసులతో మంత్రి పోల్చారు. ప్రజలు అబద్ధాలకు, అసత్య ప్రచారాలకు మోసపోవద్దని కోరారు. జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని తీర్పును ప్రజలు ఇచ్చినా, తన తప్పులను దిద్దుకోకుండా ఇంకా తప్పుడు మార్గంలోనే పయనిస్తున్నారని విమర్శించారు. వైసీపీ అనుకూల మీడియా కూడా అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని, అటువంటి మాయమాటలు నమ్మితే రాష్ట్ర భవిష్యత్తుకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని నిమ్మల రామానాయుడు కొనియాడారు. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రధాని మోదీ అండదండలతోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కేవలం సంక్షేమమే కాకుండా, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, ఈ అభివృద్ధి నిరంతరాయంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాబోయే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని మంత్రి పిలుపునిచ్చారు. మానవత్వంతో పని చేసే ప్రభుత్వానికి, రాక్షసత్వంతో ఆలోచించే పార్టీకి మధ్య ఉన్న తేడాను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.