టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన…
రూ. 1.63 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
కూటమి సర్కార్ అంటేనే నమ్మకం: ఎన్నికల హామీల్లో 99 శాతం పూర్తి చేశాం!
Minister Kinjarapu Achchennaidu: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం టెక్కలి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.1.63 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్థులకు ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటోందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఇప్పటికే 99 శాతం పూర్తి చేశామని ఆయన గర్వంగా ప్రకటించారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే చేరుస్తోందని పేర్కొన్నారు. కేవలం సామాజిక పింఛన్ల కోసమే రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ. 55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సమస్యలు లేకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 వేల సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రతి పేదవానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, 2029 నాటికి రాష్ట్రంలో 18 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మించుకుని, వైసీపీ పాలనలో ఆగిపోయిన బిల్లులను త్వరలోనే చెల్లిస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుపురంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు. పాడి రైతులను ఆదుకునేందుకు, వారికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. పశువుల పోషణకు అవసరమైన షెడ్ల నిర్మాణం, వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.