రాయలసీమపై ప్రేమ ఉన్నట్టు మరోసారి రాజకీయం చేయాలని చూస్తున్నారు..
మీ హాయాంలోనే ఎన్జీటీ ఆదేశాలతో రాయలసీమ ప్రాజెక్ట్ ఆగిపోయింది కాదా..
అమరావతి: రాయలసీమ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయడం హేయమని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నాయకులు రాయలసీమపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ప్రజలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. శుక్రవారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్జీటీ ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఆగిపోయిందని మంత్రి గుర్తుచేశారు. అలాంటి ప్రాజెక్ట్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆపుతుంది అంటూ విమర్శించడంలో అర్ధం లేదని అన్నారు.
వైసీపీ పాలనలో రాయలసీమ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. “మా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే హంద్రీనీవా ప్రాజెక్ట్కు రూ.3,700 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేసింది. ఇది చరిత్రలో రికార్డు” అని చెప్పారు. ఇకపై మరో రూ.2,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
రాయలసీమ అభివృద్ధికి రూ.40 వేల కోట్లతో భారీ హార్టీకల్చర్ హబ్ను తీసుకురాబోతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని చెప్పారు.
ఎన్టీఆర్ కాలంలో ప్రారంభమైన గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టుల వల్లే నేడు రాయలసీమకు నీటి లభ్యత పెరిగిందని మంత్రి గుర్తుచేశారు. కానీ వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టులపై ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు.
తుంగభద్ర డ్యాం గేట్లు దెబ్బతిన్నప్పుడు తక్షణమే స్పందించి నిపుణులను తీసుకువచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 33 గేట్లలో 18 గేట్లు బిగించామని, వర్షాకాలం రాకముందే మిగతా గేట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు.
రాయలసీమ ప్రాజెక్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పూర్తి చేశామని మంత్రి వివరించారు. అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు.
రాయలసీమపై వైసీపీ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మంత్రి విమర్శించారు. తమ పాలనలో ప్రాజెక్ట్పై స్టే వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని హితవు పలికారు.
రాయలసీమ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు.