ఎండ తీవ్రత, వడగాలులు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా ఉండాలి..
అమరావతి: రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఎండల తీవ్రత పెరుగుతుందని, అలాగే పిడుగులతో కూడిన అకాల వర్షాలు కూడా పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల సెల్సియస్, కడపలో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. మొత్తం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా కడపలో 19 మండలాలు, నంద్యాలలో 11, మార్కాపురంలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 4 మండలాలు కలిపి మొత్తం 67 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రేపు (ఏప్రిల్ 11) పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో వడగాల్పులు, కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కలిపి 66 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మరో 79 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉండగా, ఆదివారం నాటికి ఈ సంఖ్య 93 మండలాలకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం నమోదైన ఇతర గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తీవ్రతను చూపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 42.9°C, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 42.8°C, ఎన్టీఆర్ జిల్లా మోగులూరులో 42.6°C నమోదయ్యాయి. కృష్ణా, నంద్యాల జిల్లాల్లో 42.3°C, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో 42.1°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 42°C నమోదయ్యాయి. కర్నూలు, అనంతపురం, ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాల్లో కూడా 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ ధరించడం, తెలుపు రంగు కాటన్ బట్టలు వేసుకోవడం, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిదని తెలిపారు. వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా ఉండాలని హెచ్చరించారు. శరీరంలో నీరు తగ్గకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, సాధారణ నీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉండే అవకాశముండటంతో రైతులు, పశు కాపరులు ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతున్నందున, అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని APSDMA సూచించింది.