కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (Thalapathy Vijay) నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) చుట్టూ ఉన్న సెన్సార్ వివాదం ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. శుక్రవారం ఉదయం ఒక సానుకూల తీర్పుతో సంతోషించిన అభిమానులకు, సాయంత్రానికల్లా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టే పిడుగులాంటి వార్తను అందించింది.
శుక్రవారం ఉదయం జస్టిస్ పి.టి. ఆశా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ నిర్మాతలకు అనుకూలంగా తీర్పునిచ్చారు. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు సరైనవి కావని, వెంటనే యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించారు. దీంతో సంక్రాంతికి సినిమా రావడం ఖాయమని అంతా భావించారు.
సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు (CBFC) వెంటనే డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. అత్యవసరంగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి. అరుళ్ మురుగన్లతో కూడిన ధర్మాసనం.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించింది.
తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల అనంతరం జనవరి 21కి వాయిదా వేసింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న ఆఖరి చిత్రం కావడంతో, ఈ సినిమా జనవరి 9న (నేడు) విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల ఇప్పటికే వాయిదా పడింది. కోర్టు స్టే కారణంగా జనవరి 21 వరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం లేదు. అంటే సంక్రాంతి సీజన్లో ఈ సినిమా థియేటర్లలోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఈ చిత్రంపై దాదాపు రూ. 500 కోట్లు పెట్టుబడి పెట్టిన కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), సినిమా విడుదల ఆలస్యమవడంతో తీవ్ర ఆందోళనలో ఉంది.
అసలు వివాదం ఏంటి?
సెన్సార్ బోర్డు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న రాజకీయ అంశాలు. సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు మరియు సన్నివేశాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసేలా ఉన్నాయని బోర్డు భావిస్తోంది. ఎగ్జామినింగ్ కమిటీ క్లియరెన్స్ ఇచ్చినా, బోర్డు ఛైర్మన్ దీనిని రివైజింగ్ కమిటీకి పంపడంపై నిర్మాతలు కోర్టుకు వెళ్లారు.
విజయ్ అభిమానులు ఈ పరిణామాలపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. "విజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారు" అని సోషల్ మీడియాలో #JanaNayagan హ్యాష్ట్యాగ్తో నిరసన తెలుపుతున్నారు. సంక్రాంతికి తమ నాయకుడిని వెండితెరపై చూస్తామన్న ఆశలు ఆవిరవడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.