కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే పలు కారణాలతో ఆలస్యమైన ఈ సినిమాకు తాజాగా న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఇటీవల ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఆ నిర్ణయం చిత్రబృందానికి, ముఖ్యంగా విజయ్ అభిమానులకు భారీ ఊరటనిచ్చింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైందని అందరూ భావించారు.
సింగిల్ బెంచ్ ఆదేశాల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల వేగం పెంచే దిశగా అడుగులు వేశారు. విజయ్ అభిమానులు కూడా సినిమా త్వరలోనే థియేటర్లలోకి వస్తుందనే ఆశతో ఆనందంలో మునిగిపోయారు. ‘జన నాయగన్’ విజయ్ రాజకీయ ప్రస్థానానికి సంకేతంగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే సెన్సార్ సమస్య పరిష్కారమైందన్న వార్త కోలీవుడ్లో పెద్ద చర్చకు దారి తీసింది.
అయితే, ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన యూ/ఏ సర్టిఫికెట్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ‘జన నాయగన్’ భవితవ్యంపై మరోసారి అనిశ్చితి నెలకొంది.
డివిజన్ బెంచ్ నిర్ణయంతో సినిమా విడుదల ప్రణాళికలు పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం లేకపోవడంతో, జనవరి 21కు ముందు ‘జన నాయగన్’ విడుదల దాదాపు అసాధ్యమేనని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే భారీ పెట్టుబడులతో తెరకెక్కిన ఈ సినిమా ఆలస్యం కావడం నిర్మాతలకు ఆర్థిక భారం కాగా, అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశగా మారింది. కోర్టు తీర్పుపైనే ఇప్పుడు విజయ్ సినిమా భవితవ్యమంతా ఆధారపడి ఉంది.