ఢిల్లీ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ట్రాన్సిట్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు..
విమానాశ్రయంలో ఉన్నతస్థాయి సమావేశంలో కీలక భాగస్వాములతో మంత్రి చర్చలు..
ఢిల్లీ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ట్రాన్సిట్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద హబ్-అండ్-స్పోక్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన సన్నాహాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
నిన్న విమానాశ్రయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని కీలక భాగస్వాములతో మంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ భౌగోళిక స్థానం గురించి ఆయన ప్రస్తావిస్తూ, తూర్పు మరియు పడమటి దేశాల మధ్య ఉన్న ప్రత్యేక స్థానంతో భారత్ గ్లోబల్ ట్రాన్సిట్ హబ్గా ఎదగడానికి సహజమైన అవకాశముందని తెలిపారు.
హబ్-అండ్-స్పోక్ విధానం ప్రాముఖ్యతను వివరించిన మంత్రి, ఈ విధానం ద్వారా ఉడాన్ పథకం కింద అభివృద్ధి చెందిన టియర్-2, టియర్-3 నగరాల విమానాశ్రయాలను అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానం చేయవచ్చని చెప్పారు. దీని వల్ల ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయ మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశమూ ఈ విధానం కల్పిస్తుందని మంత్రి వివరించారు. హబ్-అండ్-స్పోక్ మోడల్ అమలు వల్ల ఆర్థిక రంగంలో కూడా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.