Artificial Intelligence: ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో కేవలం తుపాకులు, క్షిపణులే కాదు, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కృత్రిమ మేధస్సు సాయంతో సృష్టిస్తున్న నకిలీ శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజమైన ఫోటో ఏదో, ఏఐ సృష్టించిన నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఈ చిత్రాలు ఉంటున్నాయి. దీనివల్ల యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో తెలియక సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
ఇటీవల ఇరాన్కు చెందిన ఒక పత్రిక ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం పూర్తిగా ధ్వంసమైనట్లు ఒక శాటిలైట్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అయితే, నిశితంగా పరిశీలించిన నిపుణులు అది పాత గూగుల్ ఎర్త్ ఫోటోను ఏఐ సాయంతో మార్చినట్లు గుర్తించారు. ఆ చిత్రంలో కార్లు ఉన్న చోటే ఉండటం, కొన్ని చోట్ల ఫోటోలు మసకగా ఉండటాన్ని గమనించారు. అయినప్పటికీ, ఆ నకిలీ ఫోటో అప్పటికే కోట్లాది మందికి చేరుకోవడంతో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించింది.
ఎక్కడ దాడులు జరిగాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి శాటిలైట్ చిత్రాలు చాలా కీలకం. గతంలో ఇలాంటి సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు ఏఐ పుణ్యమా అని ఎవరికి వారే ఫోటోలను సృష్టించి వదులుతున్నారు. దీనివల్ల యుద్ధం గురించి ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడటమే కాకుండా, స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
కేవలం ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధమే కాకుండా, గతంలో రష్యా-ఉక్రెయిన్ భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కూడా ఇలాంటి నకిలీ చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ తప్పుడు సమాచారం వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో ఏ దేశం గెలుస్తోంది, ఏ దేశం నష్టపోయింది అనే దానిపై స్పష్టత లేకుండా చేసేందుకు కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి 'డిజిటల్ మాయాజాలాన్ని' వాడుతున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి శాటిలైట్ చిత్రాన్ని గుడ్డిగా నమ్మకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ సృష్టించిన చిత్రాల్లో కొన్ని చిన్న చిన్న తప్పులు (లాజిక్ లేని యాంగిల్స్, అక్షర దోషాలు) ఉంటాయి. వాటిని గమనించడం ద్వారా నిజానిజాలు తెలుసుకోవచ్చు. యుద్ధం లాంటి సున్నితమైన విషయాల్లో అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడటమే ఉత్తమమని చెబుతున్నారు.