ప్రపంచవ్యాప్తంగా చమురు సంపదకు ప్రసిద్ధి చెందిన సౌదీ అరేబియా ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలు వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సౌదీ ప్రభుత్వానికి చెందిన మైనింగ్ సంస్థ ‘మాడెన్’ (Maaden) తాజాగా చేసిన ప్రకటన ప్రకారం, దేశంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సుమారు 78 లక్షల ఔన్సుల బంగారు నిల్వలు కొత్తగా గుర్తించబడ్డాయి. ఇది సౌదీ అరేబియా మైనింగ్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
మాడెన్ సంస్థ చేపట్టిన విస్తృత డ్రిల్లింగ్, అన్వేషణ కార్యక్రమాల ఫలితంగా ఈ బంగారు నిధులు బయటపడ్డాయి. ముఖ్యంగా మన్సౌరా మస్సారా ప్రాంతంలో అత్యధికంగా 30 లక్షల ఔన్సుల అదనపు బంగారం ఉన్నట్లు గుర్తించారు. అలాగే వాడి అల్ జౌ అనే కొత్త ప్రాంతంలో దాదాపు 38 లక్షల ఔన్సుల బంగారం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఉరుక్, ఉమ్ అస్ సలాం ప్రాంతాల నుంచి కలిపి మరో 16.7 లక్షల ఔన్సుల పసిడి లభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఆవిష్కరణలతో సౌదీ అరేబియాలోని ప్రసిద్ధ అరేబియన్ షీల్డ్ ప్రాంతంలో ఇంకా అపారమైన ఖనిజ సంపద దాగి ఉందని స్పష్టమవుతోంది. బంగారమే కాకుండా ఇతర విలువైన లోహాలు కూడా పెద్ద ఎత్తున లభిస్తున్నాయి. జబల్ షైబాన్, జబల్ అల్ వకీల్ వంటి ప్రాంతాల్లో జరిగిన తవ్వకాలలో రాగి, నికెల్, ప్లాటినం వంటి లోహాలు ఉన్నట్లు మాడెన్ సంస్థ గుర్తించింది. దీని ద్వారా సౌదీ అరేబియా కేవలం చమురుపైనే కాకుండా మైనింగ్ రంగంలో కూడా ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ పరిణామాలు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదించిన విజన్ 2030 లక్ష్యాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయి. ఈ విజన్లో భాగంగా మైనింగ్ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో మూడో ప్రధాన స్థంభంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజా బంగారు ఆవిష్కరణలతో దేశ ఆదాయం పెరగడమే కాకుండా, ప్రపంచ పసిడి మార్కెట్లో సౌదీ అరేబియా ప్రాధాన్యం మరింత పెరగనుంది.
మాడెన్ సీఈఓ బాబ్ విల్ట్ మాట్లాడుతూ, “ఈ ఫలితాలు మా దీర్ఘకాలిక వ్యూహానికి నిదర్శనం. సౌదీ అరేబియాలో మరిన్ని బంగారు నిక్షేపాలను వెలికితీయడానికి భారీ పెట్టుబడులు కొనసాగిస్తాం” అని చెప్పారు. ప్రస్తుతం మన్సౌరా మస్సారా గనిలో ఉన్న మొత్తం బంగారు నిల్వల విలువ 1.04 కోట్ల ఔన్సులకు చేరిందని అంచనా. 2026 నాటికి మరిన్ని డ్రిల్లింగ్ పనులు చేపట్టడం ద్వారా ఈ నిల్వలు ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.