దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు.. వంటి అంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు..
సమకాలీన రాజకీయాలపై అవగాహన కల్పించుకోవాలి..
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. టీడీపీలో కార్యకర్తలే నిజమైన అధినేతలని, వారు గౌరవంగా “రైట్ రాయల్గా” జీవించాలని అన్నారు. పార్టీ కూడా కార్యకర్తలను అదే స్థాయిలో గౌరవిస్తుందని చెప్పారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన సీఎం, సమకాలీన రాజకీయాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో క్రిమినల్స్తో పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. “కిల్లర్ పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉండాలి” అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి, సమర్థంగా కౌంటర్ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజలను రెచ్చగొట్టడం, రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించడం, తర్వాత చర్యలు తీసుకుంటే రాజకీయంగా మలచడం వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. “రప్పా రప్పా” అంటూ హింసకు ప్రోత్సహిస్తారని, అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని విమర్శించారు. అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ పరామర్శలకు వెళ్తారని, కానీ వాస్తవానికి కార్యకర్తలనే కార్ల కింద తొక్కించి చంపించే పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు.
కడపలో జరిగిన పార్టీ కార్యకర్త హత్యను ఉదాహరణగా ప్రస్తావించిన సీఎం, అక్కడి డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, అలాగే రవీంద్రనాథ్ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారని ఆరోపించారు. ఆస్తుల పంపకాలలో తలెత్తిన విభేదాల కారణంగానే దస్తగిరి హత్య జరిగిందని తెలిపారు.
అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రవర్తనను ప్రస్తావిస్తూ, సాక్షులను బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనలు ప్రజల్లోకి తీసుకెళ్లి నిజాలను తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. “గొడ్డలి పార్టీ అరాచకాలను నిరంతరం ప్రజలకు వివరించాలి” అంటూ సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండి, ప్రజలతో దగ్గరగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.