వెనిజులా (Venezuela) రాజధాని కారాకస్లో సంభవించిన భారీ పేలుళ్లు లాటిన్ అమెరికా (america) మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో మిలిటరీ బేస్లకు సమీపంలో కనీసం ఏడు చోట్ల వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనల అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఆకాశంలో ఫైటర్ జెట్లు చక్కర్లు కొట్టడం వంటి దృశ్యాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కారాకస్ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వ భవనాల వద్ద భద్రతను భారీగా పెంచగా, సైన్యం అప్రమత్తత ప్రకటించింది.
ఈ పేలుళ్లు జరగడానికి ముందు నుంచే అమెరికా–వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వెనిజులా చమురు వనరులపై అమెరికా కన్నేయడంతో పాటు ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అమెరికాతో చర్చలకు సిద్ధమని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటనలు జరగడం గమనార్హంగా మారింది. చమురు కోసం అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని మదురో ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కారాకస్లో పేలుళ్లు చోటుచేసుకోవడం వెనుక రాజకీయ, వ్యూహాత్మక కారణాలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
అంతేకాదు, కొంతమంది అమెరికా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే వెనిజులా మిలిటరీ బేస్లపై దాడులు జరిగాయని కథనాలు వెలువడ్డాయి. గత కొన్ని రోజులుగా కరీబియన్ సముద్రంలో అమెరికా భారీ యుద్ధ నౌకలను మోహరించడం, వెనిజులాకు చెందిన పలు ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేయడం కూడా ఈ పరిణామాలకు బలం చేకూర్చుతోంది. అయితే ఈ దాడులు డ్రగ్స్ స్మగ్లింగ్ను అరికట్టేందుకే చేపట్టామని ట్రంప్ వర్గాలు చెబుతుండగా, వెనిజులా మాత్రం ఇది ప్రత్యక్ష దౌర్జన్యంగా అభివర్ణిస్తోంది.
ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసినట్లు చెబుతున్న సంచలన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ట్రూత్ సోషల్లో ఆయన చేసిన పోస్టులో, వెనిజులాలో జరిగిన పేలుళ్లకు అమెరికానే బాధ్యత వహిస్తోందని, అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య అమెరికా అదుపులో ఉన్నారని పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే అంతర్జాతీయ చట్టాల పరంగా తీవ్ర పరిణామాలకు దారి తీసే అంశంగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై వెనిజులా ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
మొత్తానికి, కారాకస్ పేలుళ్లు ఒక దేశాంతర సంఘటనగా కాకుండా ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న రాజకీయ, ఆర్థిక పోరాటానికి సంకేతంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇది పెద్ద ఎత్తున యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వెనిజులా వైపు దృష్టి సారించి, తదుపరి పరిణామాలు ఏ దిశగా సాగుతాయోనని ఆందోళనతో గమనిస్తోంది.