తండ్రి ఆనందం.. ‘ఇది చారిత్రక విజయం’..
నా కొడుకు విజయ్కు సీఎం పదవి దక్కబోతోంది..
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి అడుగులు వేస్తున్నట్లు తాజా ఎన్నికల ట్రెండ్లు సూచిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు కొద్దిదూరంలోనే టీవీకే నిలవడంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే, టీవీకేకు పూర్తి మెజారిటీ రాకపోయినా, ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు విజయ్తో సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు పీఎంకే పార్టీ కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి ట్రెండ్స్ ప్రకారం పీఎంకే 6 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు, సీపీఐ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
అయితే, అధికారంలో భాగస్వామ్యం విషయంలో విజయ్ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా AIADMK తో పవర్ షేరింగ్కు ఆయన విముఖత చూపుతున్నారని సమాచారం. దీంతో సాయంత్రానికి పొత్తులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ విజయంపై ఆయన తండ్రి చంద్రశేఖర ఆనందం వ్యక్తం చేశారు. “నా కొడుకు విజయ్కు సీఎం పదవి దక్కబోతోందని ఎంతో సంతోషంగా ఉంది. అతనికి నా శుభాకాంక్షలు,” అని అన్నారు.
ఎన్నికల్లో గెలుపుపై విజయ్కు మొదటి నుంచే పూర్తి నమ్మకం ఉందని, అందుకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని చంద్రశేఖర్ తెలిపారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రకంగా అభివర్ణిస్తూ, తమిళనాడుకు ఇది మంచి మార్పు తీసుకువచ్చే సమయమని అన్నారు.
విజయ్ చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాడని, ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన ఆయనలో ఎప్పటినుంచో ఉందని చెప్పారు. తమిళనాడు ప్రజలు విజయ్ను తమ ఇంటి బిడ్డగా భావించారని, ముఖ్యంగా మహిళలు, యువత అతన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారని తెలిపారు.
“అందరూ విజయ్ను ‘అన్నా’ అని పిలుస్తారు. ప్రజల ప్రేమే ఈ విజయానికి కారణం,” అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో కొత్త రాజకీయ శకం ఆరంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విజయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అన్నది కొద్ది గంటల్లో తేలనుంది.