స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమై, ఇరు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి లక్ష్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరస్పర సహకారంతో ముందుకెళ్లాలనే అంశంపై ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ భేటీలో భాగంగా మంత్రి నారా లోకేశ్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేశ్ను ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో జరుగుతున్న కీలక మార్పులపై లోకేశ్ వివరించారు. ముఖ్యంగా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ కింద చేపడుతున్న సంస్కరణలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి వల్ల కనిపిస్తున్న సానుకూల ఫలితాలపై చర్చించారు.
దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టామని, టాటా సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపస్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ స్కిల్ క్యాంపస్లను స్వయంగా సందర్శించి, అక్కడ అమలవుతున్న శిక్షణా విధానాలను పరిశీలించాలని నారా లోకేశ్ను సీఎం ఆహ్వానించారు.
అలాగే, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ దేవస్థానాన్ని వందల కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తప్పకుండా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని లోకేశ్ను ఆయన ఆహ్వానించారు. పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన పోటీ కొనసాగిస్తూనే, అభివృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకోవాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో ముందుకెళ్తే దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.