వంద రోజుల్లో 6 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలి..
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి సమీక్ష..
అమరావతి: రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ పథకం అమలును వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించాల్సిన 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లను వంద రోజుల్లో పూర్తి చేయాలని ఆయన సూచించారు.
మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, నెడ్ క్యాప్ వీసీఎండీ కమలాకర్ బాబు, పీఎం సూర్యఘర్ కాంట్రాక్టర్లు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన గడువును తప్పకుండా పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మూడు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందించే కనెక్షన్లన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల కనెక్షన్లు అమలు చేసేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి ముందుచూపుతో పీఎం సూర్యఘర్ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని మంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని, గుత్తేదారులు అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించడంతో పాటు పునరుత్పాదక శక్తి వినియోగాన్ని పెంచడం లక్ష్యమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం వేగంగా కొనసాగితే, అనేక కుటుంబాలకు దీర్ఘకాలికంగా లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.