వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు..
పశ్చిమ ఆసియా పరిస్థితులపై కేంద్రం నిశిత పర్యవేక్షణ..
దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. గృహ వినియోగానికి అవసరమైన ఎల్పీజీ, పైప్ నేచురల్ గ్యాస్ (పిఎన్జీ), రవాణా కోసం ఉపయోగించే సిఎన్జీ సరఫరా 100 శాతం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ లో జరిగిన అంతర్శాఖల సమావేశంలో పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడారు. దేశంలో గృహ వినియోగ ఎల్పీజీ సరఫరా ఎక్కడా నిలిచిపోలేదని, ఏ డిస్ట్రిబ్యూటర్ వద్ద కూడా కొరత (డ్రై అవుట్) సమస్యలు లేవని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా వ్యవస్థను పటిష్టంగా కొనసాగిస్తున్నామని చెప్పారు.
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ, పిఎన్జీ సరఫరాను ప్రస్తుతం 70 శాతం వరకు పునరుద్ధరిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందులో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వలస కార్మికుల కోసం అందించే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేసినట్లు చెప్పారు. ఈ నెల ఏప్రిల్లో ఇప్పటివరకు 1.75 లక్షల టన్నులకుపైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని, నిన్న ఒక్కరోజే 9,578 టన్నుల విక్రయం నమోదైందని వివరించారు.
ఇక పశ్చిమ ఆసియా పరిస్థితులను టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ దగ్గరగా పరిశీలిస్తోంది. షిప్పింగ్ అంతరాయాలు, లాజిస్టిక్స్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్గాలు, జెడ్డా వంటి పోర్టులను ఉపయోగించాలని సూచించామని ట్రేడ్ అడ్వైజర్ బిపిన్ మెనన్ తెలిపారు. ఇంధనం, వాయువు సరఫరాలు సాధారణ వినియోగంలో సుమారు 80 శాతం స్థాయిలో స్థిరంగా ఉన్నాయని చెప్పారు.
పోర్టులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ముఖేష్ మంగళ మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. గత 24 గంటల్లో భారత జెండా కలిగిన ఏ నౌకకూ ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయ సముద్ర కార్మికులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో మంత్రిత్వ శాఖ సహకరిస్తోందని పేర్కొన్నారు.