కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రజలకు పెద్ద శుభవార్తగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. గోవా షిప్యార్డు సంస్థ మచిలీపట్నంలో పెద్ద స్థాయిలో షిప్యార్డు ఏర్పాటు చేయడానికి ముందుుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్కు సుమారు రూ. 6 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారని మంత్రి తెలిపారు. ఈ పరిశ్రమ వల్ల ప్రాంతీయ అభివృద్ధికి పెద్ద ఊతం లభించనుంది.
మచిలీపట్నం మండలంలోని ఘంటలమ్మపాలెంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాబార్డ్ నిధులతో చేపట్టబడుతున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా త్వరితగతిన ప్రాజెక్ట్లు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి వెల్లడించారు. 2026 అక్టోబర్ నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు జరుగుతున్నాయి. మొత్తం రూ. 5,500 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతోంది. 16 బెర్తులు నిర్మించనున్న ఈ పోర్టులో మొదటి దశలో నాలుగు బెర్తులు సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు.
పోర్టుతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. చేనేత పరిశ్రమ క్లస్టర్, కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 40 కోట్లు కేటాయించారు. అదనంగా, మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి (NH–65)ను ఆరు వరుసలుగా విస్తరిస్తున్నట్లు వివరించారు. పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనపు పనులకు కూడా అనుమతులు ఇచ్చింది.
మచిలీపట్నం పోర్టులో ఎరువులు, గ్రానైట్, బొగ్గు, కంటైనర్లు వంటి వస్తువుల కోసం ప్రత్యేక స్టాక్యార్డులు నిర్మించనున్నారు. రైలు–రోడ్డు కనెక్టివిటీని కూడా మెరుగుపరచనున్నట్లు మారిటైమ్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్లు పూర్తి అయిన తర్వాత మచిలీపట్నం ఆర్థికంగా, పారిశ్రామికంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొన్నారు.