ఈ ఏడాది ఆరంభంలోనే కీలకమైన తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు “మూడో నేత్రం”లా పనిచేస్తున్న అనేక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, తాజాగా మరో అత్యాధునిక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పీఎస్ఎల్వి సి-62 రాకెట్ ద్వారా ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం దేశ భద్రత, సరిహద్దు పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించనుంది. శత్రుదేశాల కదలికలను క్షణాల్లో గుర్తించే సామర్థ్యం కలిగిన ఈ శాటిలైట్కు ఇస్రో శాస్త్రవేత్తలు ‘అన్వేషణ’ అనే పేరును పెట్టారు.
భవిష్యత్తులో భూ పరిశీలనతో పాటు రక్షణ అవసరాల కోసం ప్రయోగించే అన్ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను ‘అన్వేష సిరీస్’ పేరుతో పంపాలని ఇస్రో నిర్ణయించింది. ఈ శాటిలైట్లు కేవలం సరిహద్దుల్లో శత్రు కదలికలను గమనించడమే కాకుండా, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, వరదలు, తుఫానులు, భూకంపాల వంటి ప్రమాదాలపై ముందస్తు సమాచారం అందించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దీంతో దేశ రక్షణ వ్యవస్థతో పాటు విపత్తుల నివారణలోనూ ఈ శాటిలైట్లు కీలక భూమిక పోషించనున్నాయి. ఇది భారత అంతరిక్ష సాంకేతికతలో మరో మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఈ నెల 12వ తేదీ సోమవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వి సి-62 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ను ప్రయోగించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రయోగించనున్న EOS-N1 (అన్వేష) శాటిలైట్ సుమారు 1,485 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది. దీన్ని భూమికి సుమారు 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్లో స్థిరపరచనున్నారు. ఈ ఉపగ్రహం అధునాతన కెమెరాలు, సెన్సార్లతో భూమిపై జరిగే మార్పులను అత్యంత స్పష్టంగా చిత్రీకరించే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ప్రధాన ఉపగ్రహంతో పాటు సుమారు 200 కిలోల బరువు కలిగిన మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఇదే ప్రయోగంలో ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. వీటిలో సింగపూర్, లక్సెంబర్గ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, యూఏఈ వంటి దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి. స్వదేశీ అవసరాల కోసం భారత ఉపగ్రహాన్ని ప్రయోగించడమే కాకుండా, కమర్షియల్ ప్రాతిపదికన ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా నింగిలోకి పంపడం ద్వారా ఇస్రో ఆదాయ వనరులను పెంచుకుంటోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, రేపటి నుంచే అంతరిక్షంలో పొరుగు దేశాల కదలికలను గమనించే ‘అన్వేషణ’ ఆపరేషన్ ప్రారంభమవుతుంది.