- రాష్ట్ర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్..
- ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం: మంత్రి కందుల దుర్గేష్..
Minister Kandula Durgesh Speech About Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మహిళా శక్తిగా ఎదిగిన ప్రతి ఒక్క మహిళకు, రాష్ట్రంలోని మహిళలందరికీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి రాజధానిలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు అనిత, సవిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియాలతో కలిసి పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మహిళా శక్తిని కొనియాడారు. అంతకు ముందు సభా ప్రాంగణానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి దుర్గేష్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహిళా సాధికారత శక్తిని పెంచే విధంగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేడు నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిని వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరూ తమ కాళ్ళ మీద తమ నిలబడేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు..మహిళలకు వెన్నుదన్ను గా నిలిచిన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు. సెర్ప్, డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో ఎంట్రపెన్యూర్లుగా ఎదిగిన మహిళల ఆడియో-వీడియో ప్రదర్శనను మంత్రి దుర్గేష్ ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం. 2024-25లో ఇప్పటికే లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాం. 2026-27 నాటికి ఈ సంఖ్యను 5 లక్షలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 38 వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక సహకారాన్ని అందించింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏటా రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ మహిళలకు అండగా నిలుస్తున్నాం. పేద మహిళల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నాం.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం చిన్న వ్యాపారులకు, సాధారణ మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తోందని సూపర్ సిక్స్ పథకాలను, తద్వారా మహిళలకు ఒనగూరిన లబ్దిని మంత్రి దుర్గేష్ వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి సగం మంది మహిళలు రాజకీయ పదవులను పొందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథంలో వేగంగా దూసుకుపోతోందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు, తద్వారా రాష్ట్రం బలోపేతం అవుతుందని మంత్రి దుర్గేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మహిళలందరూ అందిపుచ్చుకుని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు.