విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు తొలి రోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. మొత్తం 72 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, 2,500 మందికి పైగా పాల్గొనడం ఈ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యత సాధించిందో స్పష్టంగా చూపిస్తోంది. దేశంలోనే అందమైన నగరంగా పేరు పొందిన విశాఖపట్నాన్ని ఇటీవలే కేంద్రం అత్యంత సురక్షిత నగరంగా ప్రకటించిందని సీఎం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను “డైనమిక్ మరియు క్రియేటివ్ నాయకుడు”గా అభివర్ణిస్తూ, ఆయన సహకారంతో ఏపీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని, పెట్టుబడిదారులు నేరుగా రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు అపార విశ్వాసం ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా మోదీ ప్రభుత్వం ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకానమీగా నిలవడం ఖాయమని ఆయన తెలిపారు. ప్రజలు, వనరులు, సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగిస్తే భారతదేశం తిరుగులేని శక్తిగా నిలుస్తుందన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం ఇప్పుడు భారతదేశాన్ని అవకాశాల కేంద్రంగా చూస్తోందని చెప్పారు. పేదరికం, అసమానతలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశాన్ని బలంగా ముందుకు నెట్టాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛానంధ్ర దిశగా కూడా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని వివరించారు.
ఏపీ అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కి త్వరలోనే స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, అలాగే క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలు రానున్నాయని ప్రకటించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో ఏపీ ఇప్పటికే దేశంలో ముందంజలో నిలిచిందన్నారు. రాష్ట్ర వనరులను సమర్థంగా ఉపయోగిస్తే ఏపీ అభివృద్ధికి ఆకాశమే హద్దని చెప్పారు. మరో రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీలు కూడా సేవల్లోకి రానున్నాయని వెల్లడించారు. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుందని, అరకు కాఫీని అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్గా నిలబెడుతున్నామని చెప్పారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా ఫుడ్ను తప్పక రుచి చూడాలని ఆయన సూచించారు.
చంద్రబాబు మాట్లాడుతూ—వ్యాపారులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 27 కొత్త పాలసీలు ప్రవేశపెట్టామని, పెట్టుబడిదారుల కోసం ఎస్క్రో అకౌంట్ సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక చర్యల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని, వచ్చే మూడు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. తదుపరి పది సంవత్సరాల్లో రాష్ట్రానికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించడమే తమ దృష్టి అని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా ఆహ్వానిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.