ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక శోభను మరింత పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి మరియు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (నవంబర్ 27) ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.
మొత్తంగా రూ. 260 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక పనులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమంతో అమరావతిలో ఆగిపోయిన మరో కీలక నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది.
తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా కృష్ణా నది తీరాన 25.417 ఎకరాల్లో వెంకన్న ఆలయాన్ని నిర్మించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పుడు ఆగిపోయిన ఈ పనులను వేగంగా పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
మొదటి దశ పనుల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. ఇందులో చేపట్టనున్న ముఖ్య నిర్మాణాలివి.. రూ. 92 కోట్లతో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారాన్ని నిర్మించనున్నారు. ఏడంతస్తుల మహా రాజగోపురం నిర్మాణం.
భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం వంటివి నిర్మిస్తారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక ఆలయం, పవిత్ర పుష్కరిణి (కోనేరు), మరియు కట్ స్టోన్ ఫ్లోరింగ్ పనులను కూడా మొదటి దశలోనే పూర్తి చేయనున్నారు. ఈ నిర్మాణాల కోసం రూ. 48 కోట్లు కేటాయించారు.
రెండో దశ పనులను రూ. 120 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఈ దశలో తిరుమల తరహా సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. తిరుమల తరహాలో ఆలయ మాడ వీధులు మరియు ఆలయానికి చేరుకునే అప్రోచ్ రోడ్ల నిర్మాణం.
భక్తుల కోసం భారీ అన్నదాన కాంప్లెక్స్ (అన్నదానం కోసం), యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి భవనం (Accommodation) నిర్మిస్తారు. అర్చకులు, ఆలయ సిబ్బంది నివాసం కోసం క్వార్టర్లు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, మరియు వాహనాల పార్కింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించనున్నారు.
అమరావతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులు ముందుకు సాగలేదు, పనులు నిలిచిపోయాయి.
తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఆగిపోయిన ఈ ప్రతిష్ఠాత్మక పనులకు మళ్లీ జీవం పోసి, వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తికాగా, రేపటి శంకుస్థాపనతో రెండు, మూడో విడత పనులు ప్రారంభం కానున్నాయి. నాలుగో విడత పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.