ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా తమ విధులకు హాజరుకావాల్సిందేనని రాష్ట్ర సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. అధికారులు చెప్పారని ఇతర కార్యాలయాల్లో పని చేయడం, డిప్యుటేషన్ పేరుతో బయట ఉండడం లేదా క్షేత్రస్థాయి పరిశీలనల పేరుతో సచివాలయం దాటి తిరగడం ఇకపై అనుమతించబోమని తేల్చి చెప్పింది. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి యాప్లో హాజరు నమోదు చేయడం తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు నేరుగా సేవలు అందించే సచివాలయాల పనితీరును మెరుగుపరచడమే ఈ నిర్ణయం లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో ఉండాల్సిన ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, సేవల విషయంలో ఆలస్యం జరుగుతుందన్న ఫిర్యాదులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు సచివాలయాల శాఖ వెంటనే చర్యలు చేపట్టి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
పరిశీలనలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేయాల్సిన ఉద్యోగుల్లో చాలామంది అనధికారికంగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యుటేషన్లపై పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రీ-సర్వే కార్యక్రమంలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు మాత్రమే పరిమిత మినహాయింపు ఇచ్చింది. అది కూడా జాయింట్ కలెక్టర్ సూచించిన సిబ్బందికే వర్తిస్తుంది. మినహాయింపు పొందిన సర్వేయర్లు కూడా తమ పని చేసే ప్రాంతంలోనే హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇది వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
సచివాలయాల పనితీరును పటిష్టం చేయడానికి ప్రభుత్వం మూడు దశల పర్యవేక్షణ వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాకు ఒక అధికారి చొప్పున నియామకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాలకు అధికారులు ఉన్నారు. మిగిలిన జిల్లాలకు మరో 13 మంది త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల పరిధిలో మొత్తం 123 మంది అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. మండల స్థాయిలో చూస్తే ప్రతి మండలానికి ఒక అధికారి చొప్పున 660 మందిని నియమించనున్నారు. ఇప్పటికే 600 మంది ఎంపిక పూర్తయ్యింది. మిగిలిన నియామకాలు వచ్చే నెల మొదటి వారంలో పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ మార్పులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామం’, ‘స్వర్ణ వార్డు’గా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆమోదం కోసం పంపింది. ఈ చర్యలన్నీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో చేపట్టినవేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.