AP Roads and Buildings: గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రోడ్లు, భవనాల శాఖ (R&B) మంత్రి బి.సి. జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కనీస మరమ్మతులకు కూడా నోచుకోక ఆర్ అండ్ బీ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన మండిపడ్డారు.
మండపేట రోడ్ల కోసం భారీ కేటాయింపులు
మండపేట నియోజకవర్గంలో రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్న మాట వాస్తవమేనని అంగీకరించిన మంత్రి, వాటి అభివృద్ధికి ఇప్పటికే రూ. 20.50 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా పనులు చేపడుతున్నామని వివరించారు. నిధుల లభ్యతను బట్టి మిగిలిన రోడ్లను కూడా అతి త్వరలోనే బాగు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బైపాస్ రోడ్లపై క్లారిటీ
మండపేట బైపాస్ రోడ్డు భూసేకరణ అంశంపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. 2017లోనే ఈ భూసేకరణ కోసం రూ. 1.85 కోట్లు మంజూరు చేసినప్పటికీ, గత ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేయకుండా పనిని రద్దు చేసిందని గుర్తు చేశారు. అయితే, తాపేశ్వరం వద్ద ద్వారపూడి - యానాం రోడ్డులో బైపాస్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయిందని, బడ్జెట్ అందిన వెంటనే ఈ పనులను ప్రారంభిస్తామని మంత్రి జనార్థన్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు.
పుష్కరాల నిధులతో అభివృద్ధి
ఈ చర్చ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుంటూ.. రాబోయే పుష్కరాల సందర్భంగా మండపేట నియోజకవర్గానికి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. పుష్కరాల నిధులను కూడా సమర్థవంతంగా ఉపయోగించి స్థానికంగా ఉన్న రోడ్లను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కడప నియోజకవర్గానికి కూడా ఊరట
కేవలం కోస్తా ప్రాంతమే కాకుండా రాయలసీమలోనూ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. కడప నియోజకవర్గ పరిధిలోని రోడ్ల కోసం ఇప్పటికే రూ. 16.79 కోట్లు కేటాయించామని, త్వరలోనే అక్కడ పనులు ప్రారంభించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామని మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కిలోమీటరు రోడ్డునూ సురక్షితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.