పోలవరానికి మరో రూ.3,300 కోట్ల నిధులకు కేంద్రం అంగీకారం..
వచ్చే సెప్టెంబర్ నాటికి మరో రూ.3,300 కోట్ల విడుదల..
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
ప్రాజెక్టు పనులు వేగంగా సాగేందుకు కేంద్రం ఆర్థికంగా కూడా మద్దతు పెంచుతోంది. ఇప్పటికే ఇటీవల రూ.2,300 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం, మరింత ఊపునివ్వడానికి మరో రూ.3,300 కోట్ల నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ మొత్తాన్ని వచ్చే సెప్టెంబర్ నాటికి అందజేయనున్నట్లు తెలిపింది.
ఈ అదనపు నిధులతో ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. పోలవరం పూర్తయితే గోదావరి నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా రైతులకు సాగునీటి సమస్యలు తగ్గి, వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభించనుంది.
పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, లక్షలాది కుటుంబాలకు దీని ప్రయోజనం చేరుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు, కేంద్రం నుంచి వస్తున్న నిధులతో ప్రాజెక్టు సమయానికి పూర్తవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.