ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై జరిగిన బీఏసీ చర్చల అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Kesav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో ప్రజా ప్రతినిధులు ఎంత సమయం మాట్లాడారు అనే దానికంటే ఎంత విలువైన సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నామనేది అత్యంత ప్రధానమని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును ఆయన అనుసరిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలను మంత్రి ఉదాహరణగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవలి దావోస్ పర్యటనలో అనుసరించిన వ్యూహాలను సభ్యులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, తక్కువ సమయంలోనే అద్భుతమైన ఫలితాలను ఎలా సాధించవచ్చో ఆయన చేసి చూపారని పయ్యావుల కేశవ్ కొనియాడారు.
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరుపై మంత్రి విశ్లేషిస్తూ ప్రతి నిమిషాన్ని ఆయన ఎంత విలువైనదిగా భావించారో వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తాను కలిసే ప్రతి పారిశ్రామిక సంస్థపై ముందస్తుగా లోతైన కసరత్తు చేశారని ఆ సంస్థ నేపథ్యం రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహనతో సమావేశాలకు హాజరయ్యారని కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ఆయా సంస్థల ప్రతినిధులకు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సమర్థవంతంగా వివరించి సమావేశాలను ముగించేవారని మంత్రి పేర్కొన్నారు. సీఎం చూపిన ఈ పనితీరును శాసనసభలో సభ్యులు కూడా ఒక పాఠంగా తీసుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు.
సభలో గంటల తరబడి ప్రసంగాలు చేయడం వల్ల సమయం వృథా కావడమే తప్ప ఫలితం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలైనా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలైనా తక్కువ వ్యవధిలో విషయాన్ని మొత్తం చెప్పే కళను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రతి నిమిషం ప్రజల సొమ్ముతో ముడిపడి ఉంటుందని.. సభ్యులు అనవసర ప్రసంగాలకు పోకుండా సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని తమ వాదనలను బలంగా తక్కువ వ్యవధిలో వినిపించడం ద్వారా సభా గౌరవం పెరుగుతుందని మంత్రి వివరించారు