ఎత్తిపోతల పథకాలపై మంత్రి నిమ్మల హామీ
గిరిజన ఉద్యోగుల సమస్యలపై చర్చ
నన్నయ వర్సిటీ అక్రమాలపై నిఘా
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు వాడీవేడీగా ప్రారంభమయ్యాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. పలు కీలక ప్రజా సమస్యలపై సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రులు సుదీర్ఘంగా సమాధానాలిచ్చారు.
పుట్టపర్తిలో ఐఐఐటీ ప్రసక్తే లేదు - మంత్రి నారా లోకేష్
ప్రశ్నోత్తరాల్లో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఐఐఐటీ (IIIT) ఏర్పాటుపై ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని మంత్రి తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలు ఐఐఐటీని తాత్కాలిక క్యాంపస్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇడుపులపాయ ఒంగోలు మధ్య విద్యార్థులు తరచూ ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల విద్యా సంవత్సరంపై ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల కొన్ని విద్యా సంస్థలు మౌలిక వసతుల లేమితో ఇబ్బంది పడుతున్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు.
నన్నయ వర్సిటీ అక్రమాలపై విచారణ
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న అక్రమాలను పిఠాపురం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సభలో ప్రస్తావించారు. సరైన అనుమతులు లేకుండానే కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఇష్టానుసారంగా పెడుతున్నారని వీటి వెనుక ఉన్న అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ఇందుకు మంత్రి సమాధానమిస్తూ, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని, నిర్దిష్టమైన వివరాలు అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చ
బొబ్బిలి నియోజకవర్గంలోని లోచర్ల-శివదావలస ఎత్తిపోతల పథకంపై ఎమ్మెల్యే బేబినాయన అడిగిన ప్రశ్నకు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లు రద్దు చేసి పనులను నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. అయితే, ప్రజల అవసరాల దృష్ట్యా ఈ పథకానికి సంబంధించి మళ్లీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
గిరిజన ఉద్యోగుల బదిలీలు
గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై పోలవరం ఎమ్మెల్యే బలరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానమిచ్చారు. గిరిజన ఉద్యోగులను వారి సొంత ప్రాంతాల్లోకి బదిలీ చేసే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, గత ప్రభుత్వం కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ సమస్య జటిలమైందని ఆమె విమర్శించారు. ప్రశ్నోత్తరాల అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. స్పీకర్ ఈ చర్చకు నాలుగు గంటల సమయం కేటాయించారు.