ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలతో పరిపాలనా వ్యవస్థలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మొత్తం 24 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదముద్ర వేసినట్లు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ మార్పులు అన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేశారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, ప్రజాభీష్టం మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఉండగా, అందులో 17 జిల్లాల్లో మార్పులు చోటుచేసుకోగా, మిగిలిన 9 జిల్లాలను యథాతథంగా కొనసాగించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం ప్రాంతాలను కలిపి కొత్తగా ‘మార్కాపురం జిల్లా’ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ మార్పులతో పరిపాలన మరింత ప్రజలకు చేరువ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అదేవిధంగా, బనగానపల్లె, అడ్డరోడ్డును కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అన్నమయ్య జిల్లా పేరును కొనసాగిస్తూనే, జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలని నిర్ణయించారు. పెనుగొండ పట్టణానికి చారిత్రక, సాంస్కృతిక గుర్తింపును ప్రతిబింబించేలా ‘వాసవీ పెనుగొండ’గా పేరు మార్చే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ప్రజాభిప్రాయం, శాస్త్రీయ అధ్యయనం లేకుండా జిల్లాల విభజన చేపట్టిందని, దాని వల్లే నేడు సరిదిద్దాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ విమర్శించారు.
మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు కీలక రహదారి నిర్మాణం కొనసాగుతోందన్నారు. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ రుణగ్రహీతలకు ఉపశమనం, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విశాఖపట్నంలో ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు వంటి నిర్ణయాలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్ణయాలతో పాలన మరింత పారదర్శకంగా, ప్రజలకు దగ్గరగా మారుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.