మహిళల సొంతింటి కలను నిజం చేస్తున్న కూటమి ప్రభుత్వం…
5 వేల కేంద్రాల అప్గ్రేడ్తో పెరగనున్న సేవలు…
రుణ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు…
Women Welfare: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళా సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ లేనిదే సృష్టి లేదని, కుటుంబ నిర్మాణంలోనే కాకుండా దేశ నిర్మాణంలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. మహిళా సాధికారతకు పునాది వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించి వారి ఆత్మగౌరవాన్ని పెంచింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను కేవలం వంటింటికే పరిమితం చేయకుండా ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేయాలనే దూరదృష్టితో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 20 నెలల కాలంలోనే మహిళల కోసం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రుణ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడం ద్వారా వారి వ్యాపార మరియు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి వివరంగా వెల్లడించారు. "తల్లికి వందనం" పథకం ద్వారా దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 10 వేల కోట్లను నేరుగా జమ చేశామన్నారు. ఎన్నికల హామీని నెరవేరుస్తూ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఇప్పటివరకు 45 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారని తెలిపారు. అలాగే వంటింటి భారాన్ని తగ్గించడానికి 3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని, ఇది మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు వారి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆయన వివరించారు.
మహిళల ఉపాధి, నివాసం మరియు విద్యా వసతుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళల కోసం ఇప్పటికే 3 లక్షల ఇళ్లను నిర్మించి అందించామని, రాబోయే ఉగాది నాటికి మరో లక్ష గృహ ప్రవేశాలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ 5 వేల మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చినట్లు చెప్పారు. లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేయడంతో పాటు వారికి అవసరమైన శిక్షణను కూడా ప్రభుత్వం అందిస్తోందని, దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.