AP Global Capability Centres: ప్రపంచ గమనంలో భారతీయుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో మన దేశం అవకాశాల గనిగా మారబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక 'రైసినా డైలాగ్ 2026' సదస్సులో ఆయన పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 'సాంకేతికత - సుపరిపాలన - భవిష్యత్తు' అనే అంశంపై ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. ఈ సదస్సుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గతంలో మెరుగైన అవకాశాల కోసం మన మేధావులందరూ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాలకు వెళ్లారని కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశంలో సాంకేతికత, నైపుణ్యం పెరగడం వల్ల త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలే ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (GCC) 60 శాతం మన దేశంలోనే ఉండటం గర్వకారణం" అని ఆయన వివరించారు. టెక్నాలజీతో పాటు గ్రీన్ ఎనర్జీలో కూడా భారత్ అగ్రగామిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఇతర దేశాలకు విద్యుత్తును ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
జనాభా నిర్వహణపై 'డేంజర్ బెల్స్'.. ఏపీ సరికొత్త పాలసీ
దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా, తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 1.5 కి పడిపోయిందని, దీన్ని 2.1 కి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. "30 ఏళ్ల క్రితం జనాభాను తగ్గించాలని 'కుటుంబ నియంత్రణ' గురించి ప్రచారం చేశాను. కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా 'పాపులేషన్ మేనేజ్మెంట్' గురించి మాట్లాడుతున్నాను" అని ఆయన అన్నారు.
దీనికోసం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు:
ముగ్గురు పిల్లలు ఉంటే: మూడో బిడ్డ పుడితే రూ. 25,000 ఆర్థిక సాయంతో పాటు, నెలకు రూ. 1,000 చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.
ప్రభుత్వ రాయితీలు: ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
చైల్డ్ కేర్ లీవ్స్: తల్లులకు పని ప్రదేశాల్లో ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సెలవులు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
రాష్ట్ర రాజధాని అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా, విజ్ఞానానికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు. అక్కడ క్రియేటివ్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ హబ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అమరావతిలో 'గ్లోబల్ లీడర్షిప్ సెంటర్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐ క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలకు ఏపీ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్తో పాటు సుమారు 110 దేశాల నుండి 2700 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో వాడుకోవడంలో చంద్రబాబు అనుభవాన్ని అందరూ ప్రశంసించారు.