Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు మాట్లాడుతూ వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. "చింత చచ్చినా పులుపు చావలేదు" అన్నట్లుగా సజ్జల ధోరణి ఉందని, 2026లో ఉన్నామన్న విషయం మర్చిపోయి ఇంకా పాత రోజుల్లోనే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా వారి అహంకారం మాత్రం తగ్గలేదని మండిపడ్డారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి నెయ్యి నాణ్యత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అశోక్ బాబు విమర్శించారు. వైసీపీ నేతలకు కేవలం లిక్కర్ స్కామ్లు, కమిషన్ల గురించి మాత్రమే తెలుసని, అందులోనే వారు 'మాస్టర్ డిగ్రీ' చేశారని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూ కోసం వాడే 'ఆరోమాటిక్ ఘీ' విశిష్టత గురించి సజ్జలకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఈ నెయ్యిని 110 నుండి 120 డిగ్రీల వరకు వేడి చేస్తారని, అందులో తేమ శాతం సున్నా ఉండాలని వివరించారు. సాధారణ మార్కెట్లో దొరికే నెయ్యికి, టీటీడీ సేకరించే అత్యున్నత నాణ్యత గల నెయ్యికి చాలా తేడా ఉంటుందని, మారుతీ కారుకు రోల్స్ రాయిస్ కారుకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుందని ఉదాహరణలతో వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన అపచారాన్ని అశోక్ బాబు ఎత్తి చూపారు. జూలై 2024లో వచ్చిన ఎన్డీడీబీ (NDDB) రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగినట్లు స్పష్టంగా తేలిందని గుర్తు చేశారు. సాక్షాత్తూ అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని పరోక్షంగా ఒప్పుకున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసిన సిట్ (SIT) విచారణలో కూడా నిజాలు బయటపడ్డాయని తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నా ఇంకా బుకాయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో పీపీఎల్ (PPL) ద్వారా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యి కొనుగోలులో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నామని అశోక్ బాబు స్పష్టం చేశారు. ఓపెన్ టెండర్ల ద్వారా నందిని, సంగం, మదర్ డెయిరీ వంటి సంస్థలు పోటీపడి నాణ్యమైన నెయ్యిని సరఫరా చేస్తున్నాయని తెలిపారు. గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన నెయ్యిని, ఇప్పుడు కేవలం రూ. 649 కే సేకరిస్తున్నామని వెల్లడించారు. ధర తగ్గినా నాణ్యతలో ఎక్కడా రాజీ పడటం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. భక్తులు కూడా ఇప్పుడు లడ్డూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
చేసిన పాపాలకు శిక్ష తప్పదని వైసీపీ నేతలను అశోక్ బాబు హెచ్చరించారు. దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసినందుకు ఇప్పటికే భక్తులు 11 సీట్లతో మొదటి శిక్ష వేశారని, త్వరలోనే చట్టం రూపంలో రెండో శిక్ష తప్పదని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పే 'దేవుడి స్క్రిప్ట్' ఇప్పుడే మొదలైందని, చేసిన తప్పులకు జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏవైనా అనుమానాలు ఉంటే డేటా పంపిస్తామని, చర్చకు రావాలని సవాల్ విసిరారు. అబద్ధపు ప్రచారాలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు.