AP Politics: రాష్ట్రంలో వైసీపీ పతనం మొదలైందని, ఆ పార్టీ హయాంలో జరిగిన అరాచకాలను చూసి ప్రజలు విసిగిపోయారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విమర్శించారు. ఆదివారం ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన 14 ఎస్సీ కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి స్వామి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేవలం 'సున్నా' అని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం కక్షసాధింపు చర్యలు, అవినీతికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని, సామాన్య ప్రజల కష్టాలను ఆ పార్టీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల తీరు నచ్చకే ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. "దళితులకు రాజకీయంగా ఉన్నత స్థానాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిదే. లోక్సభ స్పీకర్గా జి.ఎం.సి బాలయోగిని, అసెంబ్లీ స్పీకర్గా ప్రతిభా భారతిని కూర్చోబెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడింది టీడీపీ" అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని, వారికి సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలిచామని గుర్తు చేశారు.
అదే సమయంలో వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దాడులను మంత్రి తీవ్రంగా ఖండించారు. "దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం, శిరోముండనాలు చేయించడం వంటి నీచమైన రాజకీయ చరిత్ర వైసీపీది. గత ఐదేళ్లలో ఎస్సీ సామాజిక వర్గం తీవ్ర భయాందోళనల మధ్య గడిపింది. దళితుల సంక్షేమ పథకాలను నిలిపివేసి వారిని దగా చేశారు" అని ఆయన ఆరోపించారు. వైసీపీ చేసిన అన్యాయాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మంత్రి స్వామి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని మంత్రి వివరించారు. ముఖ్యంగా పేదల విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయమని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మళ్ళీ పూర్వవైభవం సంతరించుకుంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.