గన్తో బెదిరించిన యువకుడు అరెస్ట్… బస్టాండ్ వద్ద హైడ్రామా
మాచవరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు… నలుగురు నిందితులు కటకటాల్లోకి
బెంగళూరు టు విజయవాడ.. డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా అరెస్ట్…
Operation Vajraprahar in Vijayawada: విజయవాడ ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐ.పి.ఎస్ మరియు ఈగల్ ఐ.జి ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన 'ఆపరేషన్ వజ్రప్రహార్' నగరంలో సంచలనం సృష్టించింది. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తెల్లవారుజామున 5 గంటల నుంచే సుమారు 70 మంది పోలీసు సిబ్బందితో నగరంలోని లాడ్జీలు, బస్టాండ్లు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అనుమానితులను క్షుణ్ణంగా విచారించడంతో పాటు, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి అసాంఘిక శక్తుల ఆటకట్టించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, రామన్నగూడెనికి చెందిన కనకం మురళి పటేల్ అనే యువకుడు పోలీసులను గన్తో బెదిరించి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అత్యంత సాహసోపేతంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి హ్యాండ్ మేడ్ రివాల్వర్, ఐదు తూటాలు, పెప్పర్ స్ప్రే మరియు టీజర్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా రక్షణ కోసం బీహార్లో ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్స్ సారధి నాయక్, మనోహర, పి.సి. కృష్ణలను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
మరోవైపు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎం.డి.ఎం.ఏ (MDMA) డ్రగ్ను తీసుకువచ్చి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న కౌశిక్ రెడ్డి, అచ్యుత్, సాయి రేవంత్, సాయి వివేక్ అనే నలుగురు యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 19.70 గ్రాముల డ్రగ్స్తో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మైక్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై ఎన్.డి.పి.ఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసి లోతైన విచారణ చేపట్టారు.
ఈ ఆపరేషన్ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 70 బైక్లను పోలీసులు సీజ్ చేశారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆర్.టి.ఓ ద్వారా సరైన వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని, డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వం కేటాయించిన 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజల సహకారం వల్లే ఇలాంటి ముఠాలను పట్టుకోవడం సాధ్యమవుతుందని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ భారీ కార్యక్రమంలో డి.సి.పి కృష్ణ కాంత్ పటేల్, ఏ.డి.సి.పి మురళి కృష్ణ, ఏ.సి.పి దామోధర రావు మరియు వివిధ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పట్టుబడిన నిందితులకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నగరాన్ని నేరరహితంగా మార్చడమే లక్ష్యంగా ఇలాంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ యంత్రాంగం హెచ్చరించింది.