ప్రవాసాంధ్రులకు – ప్రభుత్వానికి వారధిగా కోమటి జయరాం: డా. నోరి దత్తాత్రేయుడు..
ప్రభుత్వ పాఠశాలలకు సాంకేతిక విద్యలో ప్రవాసులు సహకరించాలి..
ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం.. ప్రభుత్వానికి, ప్రవాసాంధ్రులకు మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తారని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డా. నోరి దత్తాత్రేయుడు అన్నారు. ఆదివారం ఫిలడెల్ఫియాలో ఘనంగా నిర్వహించిన జయరాం అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని భావోద్వేగంగా ప్రసంగించారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికాలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ… తెలుగుజాతి గౌరవాన్ని జయరాం నిలబెట్టారని డా. నోరి ప్రశంసించారు. తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని చెబుతూ.. ఆయన సతీమణి పేరుతో ప్రారంభమైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆ కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడారు. “నేను కూడా ఒక ప్రవాసాంధ్రుడినే కావడంతో.. నా పరిస్థితులు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బాధ్యత నాకప్పగించారు. ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను” అని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం రాష్ట్రానికి గర్వకారణమని జయరాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ వీడియో సందేశాలు అందించారు.
కార్యక్రమంలో పొట్లూరి రవి, మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, రాధాకృష్ణ మూల్పురి, రంజిత్ కోమటి, మురళి పమిడిముక్కల, ఫణి కంతేటి, శ్రీధర్ సాదినేని, నందగిరీష్ మూల్పూరి, నాగరాజు చింతం, సురేష్ యలమంచిలి, గోపి వాగ్వాల, హరనాథ్ బుంగతావుల, విశ్వనాథ్ కోగంటి, లావా ఐనంపూడి, గౌరి కొర్రోతు, సాయి బొల్లినేని, మధు ముప్పాల, శ్రీధర్ వీరమాచినేని, శ్రీహరి మందడి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ అభినందన సభలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు జయరాంను అభినందిస్తూ.. ఆయన కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.