40 మందికిపైగా దాతల భాగస్వామ్యం.. 50 సార్లకు పైగా రక్తదానం చేసిన రంజిత్ కోమటికి ఘన సత్కారం..
తెలుగు సమాజం నుంచి విశేష స్పందన పొందిన తానా రక్తదాన కార్యక్రమం..
అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ బృందం ఆధ్వర్యంలో సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ప్రాణాలను కాపాడే ఈ మహత్తర సేవా కార్యక్రమానికి తెలుగు సమాజం నుంచి విశేష స్పందన లభించింది.
ఈ రక్తదాన శిబిరాన్ని తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, సమాజానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 40 మందికిపైగా రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ బృందాన్ని, ప్రాంతీయ ప్రతినిధి ఫణికంతేటిని, వాలంటీర్లను, రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే 50 సార్లకు పైగా రక్తదానం చేసి అరుదైన మైలురాయిని చేరుకున్న రంజిత్ కోమటిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో తానా ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
మే 31న ఎక్స్టాన్లో నిర్వహించిన ఈ బ్లడ్ డ్రైవ్కు మంచి స్పందన లభించింది. తొలిసారిగా రక్తదానం చేసిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి వేదికను ఉచితంగా అందించిన వేణు సంగనికి, రక్త సేకరణలో సహకరించిన బ్లడ్ బ్యాంక్ ఆఫ్ డెల్మార్వా బృందానికి తానా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి స్ప్రూస్ ఇన్ఫోటెక్ గ్రాండ్ స్పాన్సర్గా వ్యవహరించగా, టెస్లా రియాల్టీ గ్రూప్, తనిష్క్ యూఎస్ఏ, చు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఓక్స్టన్, స్ప్రింగ్ ఈగిల్స్, రియల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వారణాసి సంస్థలు ప్రీమియం స్పాన్సర్లుగా సహకరించాయి.
ఈ సేవా కార్యక్రమంలో సురేష్ యలమంచి, భవాని క్రొత్తపల్లి, శైలజ కస్తూరి, సరోజ పావులూరి, విశ్వనాథ్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, శ్రీనివాస్ అబ్బూరి, హరి, గౌరి కర్రోతు, నాగరాజ్, కోటి యాగంటి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ కునారపు, రమణ కోత, మధు నల్ల తదితరులు పాల్గొని కార్యక్రమ విజయానికి తమ వంతు సహకారం అందించారు.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం సేవా భావానికి, సమాజం పట్ల బాధ్యతకు నిదర్శనంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.