డాలస్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జయరాం కోమటి..
ప్రవాస భారతీయుల ఐక్యతకు ప్రతీక గాంధీ మెమోరియల్: జయరాం కోమటి..
డాలస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ పర్యటనకు వచ్చిన జయరాం కోమటి, అమెరికాలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించి బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.
డాలస్ నగరంలోని ఈ ప్రతిష్ఠాత్మక స్మారక స్థలిలో జయరాం కోమటికి ఘన స్వాగతం లభించింది. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు ఆయనకు స్వాగతం పలికి జ్ఞాపికను అందజేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ గుళ్ళపల్లి సహా పలువురు ప్రవాస భారతీయులు పాల్గొని కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, దాదాపు పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న ఈ మహాత్మా గాంధీ స్మారక స్థలి కేవలం ప్రవాస భారతీయులకే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, అమెరికన్ రాజకీయ ప్రముఖులు కూడా ఈ స్మారక స్థలిని సందర్శించారని ఆయన గుర్తు చేశారు.
ప్రవాస భారతీయుల ఐక్యతకు, భారతీయ విలువల పరిరక్షణకు ఈ గాంధీ మెమోరియల్ ఒక ప్రతీకగా నిలుస్తోందని జయరాం పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును సాకారం చేయడంలో విశేష కృషి చేసిన మహాత్మా గాంధీ మెమోరియల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూరతో పాటు వారి కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
గాంధీ సిద్ధాంతాలు, శాంతి సందేశం ప్రపంచానికి ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్న జయరాం కోమటి, విదేశాల్లో ఉన్న భారతీయులు తమ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకుంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.